గురువారం ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి విశాఖపట్నంకి 400 కి.మీ., గోపాల్పూర్ (ఒడిశా)కి 420 కి.మీ పారాదీప్ (ఒడిశా)కి 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్–పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. దక్షిణకోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదుని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.