సూపర్ సిక్స్ లో 85 శాతం పథకాలు అమలయ్యాయా?
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో 85 శాతం పథకాలు అమలు చేసిందని మంత్రి పార్థసారథి చెప్పారు.;
ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్ హామీల్లో 85 శాతం ప్రభుత్వం అమలు చేసిందని ప్రకటించి గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు. సూపర్ సిక్స్ హామీల్లో దీపం-2 పథకం అమలైంది. శుక్రవారం నుంచి తల్లికి వందనం పథకం అమలులోకి వచ్చింది. ఇంకా నాలుగు పథకాలు అమలు కావాల్సి ఉంది.
అందులో నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకూ ఏటా రూ. 20వేల సాయం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500లు నగదు సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలులోకి రావాల్సి ఉంది. ఏడాది తరువాత రెండో ఏడాదిలో తల్లికి వందనం అమలు చేశారు. మూడు నెలల క్రితం ఉచిత గ్యాస్ పథకం అమలైంది. సూపర్ సిక్స్ లో నాలుగు పథకాలు అమలులోకి రాకుండా రెండు పథకాలు మాత్రమే అమలులోకి వచ్చాయి. అలాంటప్పుడు 85 శాతం సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు.
బందరు రోడ్డులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూటమి సర్కార్ ఏడాది పాలనపై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్లుతున్నామన్నారు. గత ప్రభుత్వం వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పుల గంప మాకు అందించిందని, అయినా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఏడాది పాలనలో 85 శాతం అమలు చేసారన్నారు. ఇది మా ముఖ్యమంత్రి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మా ప్రభుత్వం 15 శాతం అభివృద్ధి లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
అన్నదాత సుఖీభవ క్రింద రైతన్నకు ఈ నెలలోనే సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో యావరేజ్ గా ప్రతి కుటుంబానికి రూ. 30,000 అందించగా, మేము ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ ద్వారా రూ. 1.04 లక్షల రూపాయలు అందించామన్నారు. గత ప్రభుత్వంలో పిల్లల భవిష్యత్ గురించి కనీసం ఆలోచించలేదన్నారు. మేము వారి భవిష్యత్ గురించి ఆలోచించి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని దాని ద్వారా దాదాపు 8 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. తల్లికి వందనం లబ్ధిదారులైన తల్లులు, పిల్లలతో కలసి మంత్రి కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.