సీడ్‌ బాల్స్‌తో హరిత హారం!

వేల ఏళ్ల నాటి విత్తన బంతుల సంప్రదాయానికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ మహా యజ్ఞంలో బాలబాలికలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు.;

Update: 2025-06-05 03:08 GMT
సీడ్‌ బాల్స్‌ తయారీలో నిమగ్నమైన ఎన్‌సీసీ క్యాడెట్లు

సీడ్‌ బాల్స్‌! వీటినే విత్తన బంతులు అని కూడా అంటారు. వేల ఏళ్ల క్రితం ఆది మానవులు ఏనుగులు, పశువుల లద్దె నుంచి వచ్చిన మొక్కలు పెరిగి వృక్షాలయ్యాక వాటి ఫలాలను ఆరగించి జీవనం సాగించేవారు. ఆ తర్వాత విత్తనాలను దాచుకోవడానికి ఆవుపేడ, ఆవు మూత్రం, ఒండ్రుమట్టి, కట్టెల బూడిదను కలిపి ఆరబెట్టే వారు. ఆ తర్వాత సీజను వచ్చాక నాటేవారు. పంటలను పండించే వారు. ఆగాకర, కాకర, ఓస తదితర జిగురు గుణం కలిగిన విత్తనాలను పిడకల్లో వేసి గోడకు కొట్టేవారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కాలక్రమంలో విత్తనాలను తయారు చేసి మార్కెట్లో అమ్మకం చేపట్టే స్థితికి వచ్చారు.


విత్తన బంతుల కోసం సేకరించిన విత్తనాలు 

వివిధ జాతుల చెట్లు, వృక్ష జాతులు అంతరించిపోతున్న తరుణంలో వాటి ఆవశ్యకతతో పాటు సంరక్షణకు పాటు పడుతున్నారు కొందరు పర్యావరణ ప్రియులు. అలా దాదాపు పాతికేళ్ల క్రితం గ్రీన్‌ క్లైమేట్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అలనాటి విధానంలో విత్తన సంరక్షణకు విశాఖలో శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచి విత్తన బంతుల (సీడ్‌ బాల్స్‌) తయారీపై దృష్టి సారించారు. ఇందులో విద్యా సంస్థలు, విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 780 విద్యా సంస్థలు విత్తనాలుత సేకరణ, సీడ్‌ బాల్స్‌ తయారీలో పాలు పంచుకుంటున్నాయి. వీరి సంకల్పానికి అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు.

 తయారైన విత్తన బంతులు

విత్తనాలు ఎలా సేకరిస్తారు?

విద్యార్థినీ విద్యార్థులు రోడ్లు పక్కన, కొండ ప్రాంతాల్లో పెరిగే వివిధ రకాల వృక్షాలు, పండ్ల చెట్ల నుంచి విత్తనాలను సేకరిస్తారు. వీటిలో అధికంగా రావి, మర్రి, జువ్వి, వంటి వాటితో పాటు నేరేడు, ఈత, చీమ చింత, జామ, మామిడి, పనస, సపోటా తదితర 130 రకాల విత్తనాలు ఉంటాయి. ఇంకా విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో 400 రకాల మొక్కలు నాటారు. ఈ యూనివర్సిటీ వీసీ అనుమతితో ఆ మొక్కల విత్తనాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే తూర్పు కనుమల నుంచి తాని, కరక, ఇండుగ వంటి ఔషద చెట్ల విత్తనాలను తీసుకొస్తున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లోని చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను కొన్నాళ్లు ఆరబెడతారు. గోశాలల నుంచి ఆవుపేడ, నదులు, చెరువుల గర్భాల నుంచి ఒండ్రు మట్టిని తీసుకొస్తారు. ఈ మట్టి, ఆవుపేడలతో విత్తనాలకు బూడిద కలిపి సీడ్‌ బాల్స్‌ను తయారు చేస్తారు. ఇవి విత్తనాల సైజును బట్టి గోళీ కాయ నుంచి బంతి సైజు వరకు ఉంటాయి. ఒక్కో విత్తన బంతిలో సైజును బట్టి ఒకటి నుంచి ఆరు వరకు విత్తనాలుంటాయి. పదేళ్ల క్రితం నుంచి దేశీయ విత్తనాలను అడవుల్లోనూ పెంచాలని నిర్ణయించారు. చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాల సేకరణను కూడా చేపట్టారు.

కైలాసగిరిపై నుంచి సీడ్‌ బాల్స్‌ వేస్తున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్, వీసీలు

విత్తన బంతులను ఏం చేస్తారంటే?

తయారు చేసిన విత్తన బంతులను కొండలు, అటవీ, సముద్ర తీరం, నదీ పరివాహక, మైదాన ప్రాంతాల్లో వర్షాకాలంలో వెదజల్లుతారు. వీటిలో సగటున 40 శాతం విత్తనాలు మొలకెత్తుతాయి. క్రమంగా మొక్కలుగా వృద్ధి చెందుతాయి. ఈ మొక్కలు/చెట్లు పశుపక్ష్యాదులకు గూడునిస్తాయి. అంతేకాదు.. వాటికి కాసే పండ్లు, కాయలు వాటికి ఆహారాన్ని ఇస్తాయి.

అటవీ ప్రాంతంలో విత్తన బంతులు వేయడానికి వెళ్తున్న విద్యార్థినులు

పాతికేళ్లలో 4 కోట్ల విత్తన బంతులుః జేవీ రత్నం
గడచిన పాతికేళ్లలో సుమారు నాలుగు కోట్ల విత్తన బంతులను తయారు చేశాం. వాటిని అనువైన సీజనులో వివిధ ప్రాంతాల్లో వెదజల్లాం. మా సంకల్పంలో విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీరందరి సహకారంతోనే ఇప్పటి వరకు నాలుగు కోట్ల విత్తనాలను తయారు చేయగలిగాం. మేం వెదజల్లిన విత్తనాలతో మొలకెత్తిన మొక్కలకు కాసే పండ్లు పక్షుల ఆకలిని తీరుస్తుండడంతో పాటు గూడును ఇస్తున్నాయి.

గ్రీన్‌ క్లైమేట్‌ కార్యదర్శి జేవీ రత్నం

అంతేకాదు.. హరిత హారాన్ని పెంపొందించడం లోనూ మేం భాగస్వాములవుతున్నాం. ఇతరులనూ భాగస్వాములను చేస్తున్నాం. ఆది మానవుల కాలంలో ఆరంభమైన విత్తన బంతుల ఆవశ్యకత నేటి తరానికి తెలియజేస్తున్నాం’ అని గ్రీన్‌ క్లైమేట్‌ కార్యదర్శి జనపరెడ్డి వెంకటరత్నం ‘ద «ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News