CM CHANDRABABU | కుప్పం:24 గంటలు తిరగకండానే.. శిరీషకు ప్రభుత్వం ఆసరా
బాధితురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షలు అధికారులు అందించారు. కుప్పంలో 50 సెంట్లు భూమి కూడా మంజూరు చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-18 13:28 GMT
కుప్పంలో ఆటవిక శిక్షతో నరకం అనుభవించిన బాధిత మహిళకు రాష్ర్ట ప్రభుత్వం ఆసరా ఇచ్చింది. బాధిత మహిళకు సీఎం ఎన్. చంద్రబాబు ఇచ్చిన హామీని 24 గంటల్లో సాకారం చేశారు. బాధిత మహిళ శిరీషకు బుధవారం రూ. ఐదు లక్షల చెక్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్. మునిరత్నం అందించారు. బాధితురాలి పిల్లల్లో ఒకరిని విజలాపురంలోని గురుకుల పాఠశాలలో చేర్పిస్తామన్నారు. బాధితురాలికి కుప్పంలో 50 సెంట్లు భూమి ఇవ్వడానికి అసైన్మెంట్ కమిటీలో తీర్మానించారు.
కుప్పం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( Kuppam Urban Development Authority Kada ) కార్యాలయానికి శిరీష తన ముగ్గురు పిల్లలను పిలిపించారు. కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ తో కలిసి మునిరత్నం పరిహారం చెక్కును అందించారు. అంతకుముందు శిరీష కుటుంబ వివరాలు, జీవినంపై అధికారులు వాకబు చేశారు.
శిరీషతో మాట్లాడుతున్న కడా డైరెక్టర్ వికాస్ మర్మత్
"కుప్పం మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన శిరీషపై జరిగిన సంఘటన అమానవీయం. ఆమె కుటుంబానికి అండగా ఉంటాం" అని ఏపిఎస్ఆర్టిసి వైస్ ఛైర్మన్ పి.ఎస్. మునిరత్నం ధైర్యం చెప్పారు.
జరిగిన సంఘటన ఇది..
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేశాడు. ఆ అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ, బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు సోమవారం వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకున్నారు. శిరీషను లాక్కుని వచ్చి, రోడ్డు పక్కనే చెట్టుకు కట్టేసి, అమానవీయంగా వ్యవహరించారు.
సీఎం చంద్రబాబు సీరియస్
కుప్పంలో సోమవారం జరిగిన సంఘటన మీడియా ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం పార్టీ నేతలు, పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం ఎన్.చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మఠికంఠ చందోలుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ తరువాత కుప్పంలో ఉన్న బాధిత మహిళ శిరీషకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఓదార్చడంతో పాటు ప్రభుత్వం పక్షాన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ఆయన శిరీషకు హామీ ఇచ్చారు.
24 గంటల్లోనే...
బాధిత మహిళను కుప్పం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్. మునిరత్నం, కడా డైరెక్టర్ వికాస్ మర్మత్ పిలిపించారు. శిరీషతో పాటు ఆమె ముగ్గురు పిల్లలతో మాట్లాడారు. సీఎం ఎన్. చంద్రబాబు రూ. ఐదు ఆర్థికసాయం మంజూరు చేసిన విషయాన్ని శిరీషకు వివరించిన అధికారులు, ఆ చెక్కు అందించారు. ఈ సొమ్ము పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని సూచించారు. పిల్లల చదువుకు అండగా ఉంటామని ఆర్టీసీ చైర్మన్ మునిరత్నం, కడా డైరెక్టర్ వికాస్ మర్మత్ సీఎం చంద్రబాబు పక్షాన హామీ ఇచ్చారు.
"కుప్పంలో శిరీషపై జరిగిన అవమానకర ఘటన మానవత్వం తలదించుకునేలా ఉంది" ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి కర్కశంగా కొట్టడం ఏమాత్రం క్షమించతగిన విషయం కాదన్నారు.
వారి ఆటలు సాగనివ్వం
పేదల అవసరాలను అదునుగా చూసుకుని వడ్డీ వ్యాపారులు వందకు రూ.10, అంతకంటే ఎక్కువ వడ్డీ వసూలు చేసే విధానం ఇక చెల్లదని మునిరత్నం హెచ్చరించారు. అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేసే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హెచ్చరించారు. సీఎం ఎన్. చంద్రబాబు ఫోన్ ద్వారా బాధితురాలిని పరామర్శించారని, నేరస్థులను విడిచిపెట్టేది లేదని కూడా హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా శిరీషను ఫోన్ ద్వారా పరామర్శించి నేరస్థులను కఠినంగా శిక్షించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కుప్పంలో మహిళకు జరిగిన విషాధ ఘటనపై సీఎం వ్యక్తిగతంగా తీసుకుని పరిశీలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా ప్రభుత్వం ఇలాగే స్పందిస్తుందన్నారు.