రెండు మండలాలకు బంగారు పతకాలు
ఎన్టీఆర్ జిల్లాలోని రెండు మండలాలకు నీతి ఆయోగ్ బంగారు పతకాలు ప్రకటించింది. పతకాలతో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందించారు.;
ప్రధాన మంత్రి ఆకాంక్షిత బ్లాక్స్ కార్యక్రమం (ఏబీపీ) 2023, జనవరి 7న ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక, మానవాభివృద్ధి సూచికల్లో అభివృద్ధి సాధించేలా దేశ వ్యాప్తంగా 500 బ్లాక్లను ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలు ఉన్నాయి.
ఆకాంక్షిత బ్లాక్స్ కార్యక్రమం (ఏబీపీ) అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక కీలకమైన అభివృద్ధి కార్యక్రమం, దీనిని నీతి ఆయోగ్ సమన్వయంతో అమలు చేస్తారు. ఈ కార్యక్రమం దేశంలోని వెనుకబడిన జిల్లాలలోని నిర్దిష్ట బ్లాక్లను (మండలాలు) గుర్తించి, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్లాక్లను "ఆకాంక్షిత బ్లాక్స్" అని పిలుస్తారు. ఇవి సామాజిక, ఆర్థిక సూచికలలో వెనుకబడి ఉంటాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టిపెట్టి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతోంది. మొత్తం 40 సూచికల్లో ప్రగతిని ఎప్పటికప్పుడు మదిస్తూ.. మెరుగైన ప్రణాళికలను అమలుచేస్తూ ముందుకెళ్లడం జరుగుతోంది. తాజాగా ఈ రెండు మండలాలు ఆరు సూచికల్లో 100 శాతం ఫలితాలు సాధించడంతో నీతి ఆయోగ్ బంగారు పతకాలను ప్రకటించింది. ఈ పతకాలతో పాటు ప్రశంసా పత్రాలను ఈ విజయంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి ప్రదానం చేసే కార్యక్రమం మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ పాల్గొన్నారు.
ఏబీపీ ప్రధాన లక్ష్యాలు
ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, తల్లి మరియు శిశు ఆరోగ్యం, పోషకాహార లోపాలను తగ్గించడం.
నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం.
రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్, శుభ్రమైన నీటి సరఫరా వంటి సౌకర్యాలను మెరుగుపరచడం.
బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక సాక్షరత, మరియు ఉపాధి అవకాశాలను పెంచడం.