ఉద్యోగులతో ’మాటా..మంతి‘ లో పవన్ పలుకులు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటా-మంతి నిర్వహించారు.

Update: 2025-12-10 13:09 GMT

‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు నాకు తెలుసు. నా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించాను. ఉన్నతాధికారులను అడిగితే తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని చెప్పారు. ఒక ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లామ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రమోషన్లతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలన్నారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో మీరంతా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశాం.. మరిన్ని అమలు చేయబోతున్నామన్నారు. చట్టబద్దంగా మీకు చేయగలిగినవన్నీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.  క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నా. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ కావాలని శశిషణ్ కుమార్ ని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా నా సొంత తెలివితేటలు వాడలేదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు తీసుకోకుంటే ఒప్పు అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను.  శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ లాంటి నిబద్దతతో పని చేసే బలమైన అధికారులు నాతో ఉన్నారు. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వ పాలనలో చాలా అంశాల్లో పారదర్శకత లేదన్న విషయాన్ని వీరు నా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేయలేదు. కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకీ, బదిలీకి ఒక రేటు కార్డు ఉండేది. ఇలాంటి పరిస్థితులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన వరకు ఉద్యోగులకు ఎంత పారదర్శకంగా వ్యవహరించగలమనే ఆలోచన చేశాం
 పూర్తి పారదర్శకంగా పదోన్నతులు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఔట్ సోర్సింగ్ తో కలిపి సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి పదోన్నతులు కల్పించే వ్యవహారంలో కార్యాలయ అధికారులు వెన్నెముకలా నిలిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థ ప్రక్షాళణకు సంస్కరణలు అవసరం అని వారు చెప్పేవారు. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పదోన్నతుల వ్యవహారంలో నేను కల్పించుకోను అని ముందే చెప్పా. అయితే పాదర్శకతతో కూడిన పాలన కావాలని మాత్రమే కోరుకున్నా. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా నివేదికలు ఇవ్వాలని సూచించా. బదిలీలు, పదోన్నతులపై ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లెటర్లు ఇచ్చారు. సిఫార్సు పొందిన ఉద్యోగికి నిర్దేశిత ప్రమాణాలకు తగ్గ అర్హత ఉంటేనే దాన్ని ఆమోదించాలని స్పష్టంగా చెప్పాం.
 ఆర్థిక వ్యవస్థ గాడినపడితే ఉద్యోగుల ఆకాంక్షలు తీరుతాయి
ఈ రోజున మనం 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదోన్నతుల వ్యవహారంలో ఇంత భారీ స్థాయిలో సంస్కరణలు అమలు చేయలేదు. నేడు పూర్తి పాదర్శకంగా మీకు పదోన్నతులు కల్పించాం. మేము ఎంత పాదర్శకంగా నిలబడ్డామో అదే స్ఫూర్తిని మీరు గ్రామాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాల పెంపు గురించి మాట్లాడాలి. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్నీ ఒకేసారి చేయలేమన్న విషయాన్ని గుర్తించాలి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చాయో అంతా చూశారు. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో అనేక సమస్యలు ఉండేవి. వి.డి.ఒ.లుగా నియమితులైన వారు అదే పోస్టులో పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎం.పి.డి.ఒ. గా నియమితులైన వారికి 22 ఏళ్ల పాటు పదోన్నతి లేని పరిస్థితి. దీంతో పని పట్ల అధికారుల్లో కొంత మేర నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్దంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకువచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎం.పి.డి.ఒ. స్థానంలో నేరుగా డి.డి.ఒ.లుగా ఎంపికయ్యే వెసులుబాటు కల్పించాం.
ప్రమోషన్ల వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అమలు చేయని నిర్ణయాలను మన ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో జిల్లా పరిషత్ సీఈవో స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థాయిలో కూడా తొలిసారి 70 మందికి ప్రమోషన్లు ఇవ్వబోతున్నాం. ఇంజినీరింగ్ విభాగంలో ఇ.ఎన్.సి. స్థాయి అధికారిగా కూడా డిప్యూటీ ఇంజినీరు, ఎగ్జికూటివ్ ఇంజినీరు పోస్టుల్లో ఉన్న అధికారులే బాధ్యతలు నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఇ.ఎన్.సి. స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం.
సంస్కరణలతో పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధి
గ్రామాల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశాం. పంచాయతీల అధికారాలు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేశాం. 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో మూడు, నాలుగు పంచాయతీలకు ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించే వారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభతరం అవుతాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్) గా మార్చాము. 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలను సాకారం చేసే దిశగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాం. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారిని నియమించి మున్సిపాలిటీలతో సమాన అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకున్నాం.
పని చేసే పరిస్థితుల్లో మార్పు తెచ్చాం
73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 77 డి.డి.ఒ. కార్యాలయాలు ప్రారంభించాం. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఓ మూలన కూర్చుని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజినల్ అధికారులు అయిన DDO, DLPO, APD(డ్వామా) మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే సేవలు అందిస్తారు. పౌర సేవలు విస్తృతం చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్గం దోహద పడుతుంది.
మహిళా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు
దీంతోపాటు ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్తున్నాం. విధి నిర్వహణలో చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాం. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే వారిపై బలమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాజకీయ పరమైనదాడులను ఉపేక్షించం. అలాగే ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకున్నాం. ఉమ్మడి కడప జిల్లా, గాలివీడు ఎంపీడీఓ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారిపై ఓ పార్టీ వారు దాడి చేసినప్పుడు స్వయంగా వెళ్లి అండగా నిలిచాం. మా పర్యవేక్షణలో ఉన్న శాఖల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటాం.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఉద్యోగులంతా ఒక వ్యవస్థగా పని చేయాలి. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీవంతు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నేను జవాబుదారీతనంతో ఉంటాను. మీరు తప్పు చేయొద్దు” అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ కమిషనర్ ముత్యాల రాజు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎంఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, ఇంజినీరింగ్ విభాగం చీఫ్ లు బాలూ నాయక్, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News