ఏపీ బీజేపీ నూతన అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్
సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనుండగా, మంగళవారం ఎన్నిక నిర్వహించనున్నారు.;
By : The Federal
Update: 2025-06-30 07:43 GMT
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నూతన అధ్యక్షులు ఎవరనే ఉత్కంఠకు ఆ పార్టీ పెద్దలు తెరదించారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మధవ్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆ మేరకు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు పంపినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని బీజేపీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఉన్నారు. 2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా మాధవ్ విధులు నిర్వర్తించారు. తర్వాత 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. ఈయన 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు కుమారుడే ఈ పీవీఎన్ మాధవ్. తండ్రి చలపతిరావు రెండు సార్లు ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. తండ్రి వారసత్వం అందిపుచ్చుకున్న మాధవ్ బీజేపీలో అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్లోను, బీజేవైఎంలోను మాధవ్ క్రియాశీలకంగా పని చేశారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి మాధవ్ సోమవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారం విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని ఆ పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.