TTD | భూమనా.. ఏమి మాటలివి..?
తిరుమలలో మరో వివాదానికి వైసీపీ తెరతీసింది. మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై టీటీడీ సీరియస్ గా స్పందించింది. మీ మాటలకు ఆధారాలు ఉన్నాయా? అని నిలదీసింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-20 11:47 GMT
తిరుమలలో మరో వివాదానికి వైసీపీ బీజం వేసింది. ఆ పార్టీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి తీవ్ర ఆరోపణలు సంధించారు. దీనిపై టీటీడీ అధికారులు ఘాటుగా స్పందించారు. దీంతో మళ్ళీ వైసీపీ వర్సెస్ టీటీడీగా మారింది.
"శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఓ ఆరోపణలు అస్త్రం సంధించారు. టీటీడీలో ఓ పెద్ద అధికారి ఇలా వ్యవహరించారు. అని వ్యాఖ్యానించిన కరుణాకరరెడ్డి ఆ అధికారు పేరు మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ఈఓ, అదనపు ఈఓ పక్షాన టీటీడీ పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
"వేద పారాయణదారులతో అధికారి అవహేళనగా మాట్లాడడం అని చెప్పడం పూర్తిగా అవాస్తవం" అని ఆ ప్రకటనలో ఆక్షేపించింది. ఈ ప్రకటనలో ఇంకా ఏమి ప్రస్తావించారంటే..
"ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచాం. అంతేకాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగింది. శ్రీవారి ఆలయం, వెలుపల, ఉభయ కాలిబాట, కళ్యాణకట్ట, శ్రీవారిసేవ, బయట క్యూలు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ అనే నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం" అని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక - మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. అని తెలిపారు.
2.అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం.
అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయం లోపల కూడా భక్తుల నుంచి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
3. పీఠాధిపతులకు నోటీసులు
ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి.
గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
5.ఏఐ టెక్నాలజీ
ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీటీడీ అధికారులు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి హితవు పలికారు.
"గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం" అని టీటీడీ ప్రకటనలో ప్రస్తావించారు. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం అని కూడా వివరించారు.
"చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం. టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం" అని కూడా వివరించారు.
IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది. అని గుర్తు చేశారు.
6.పరకామణిలో తనిఖీ
2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టామని ప్రకటించారు. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం అని తెలిపారు. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేస్తాం. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు. వాటిని వక్రీకరించి, టీటీడీపై అసత్య ఆరోెపణలు చేయడం మంచిది కాదని, వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి టీటీడీ హితవు పలికింది.