చంద్రబాబును ప్రశ్నిస్తున్న ఆంధ్రా మేధావులు
గోదావరి-బనకచర్ల ఎవరి కోసం?;
ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి, నాయకుల కోసమో... వారి ప్రయోజనాల కోసమో కాదనే విషయం పాలకులు గుర్తిస్తే చాలని విజయవాడలో ‘ఆలోచనా పరుల వేదిక’ ఆధ్వర్యంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. నీటిపారుదల రంగ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు, ప్రయోజనాలకు కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పరిరక్షణకు అనుగుణంగా ఉన్నదా? లేదా? అని పాలకులు ప్రశ్నించుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు అవసరం లేదన్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని కేవలం, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే పనికొస్తుందన్నారు. రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారుతుందన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకు సాగు నీరు అందే పరిస్థితులు లేవని, అందుకు కారణం కాలువలు లేకపోవడమేనన్నారు. ఆ పనులు చేపట్టకుండా ఇటువంటి ఉపయోగం లేని ఆలోచనలు ఎందుకని ప్రశ్నించారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లు, మెగా కృష్ణారెడ్డి బుర్రలో పుట్టిన ఆలోచనే బనకచర్ల ప్రాజెక్టు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొచ్చి దానిని అత్యంత వేగంగా చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారని, ఇది తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఫుట్ బాల్ ఆటగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టు అవసరం నాయకులకు తప్ప ప్రజలకు లేదన్నారు. బనచర్లను అడ్డం పెట్టుకుని కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా నీటిని తెలంగాణ వాళ్లు అడుగుతున్నారని అన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు వత్తిడి పెంచితేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ఉద్యమ రూపం దాల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బనచర్ల ప్రాజెక్టును పక్కన బెట్టి పోలవరం సోమశిల ప్రాజెక్టును చేపట్టాలని నీటిపారుదల శాఖ రిటైర్డ్ జింజనీర్ కంభంపాటి పాపారావు పేర్కొన్నారు. 1985-1989 మధ్య బనకచర్ల వద్ద ప్రాజెక్టు నిర్మించారని, దానిని నింపేందుకు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోతిరెడ్డిపాడు నుంచి ఉపయోగించుకోవడం చేతకాక 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలవరం నుంచి నీరు తీసుకొస్తామనటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నదులకు పైభాగాల్లో ఉన్నాయని, ఎత్తులో ఉన్న ప్రాజెక్టులు నింపుకోవడం ముఖ్యమనే విషయం పాలకులు గుర్తించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు గరిష్ట స్థాయిలో నీటిని రాయలసీమకు తరలించడంతో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయన్నారు.
రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని, ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే లక్షన్నర కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానది నుంచి 200 టీఎంసీల నీటి హక్కులను కోల్పోతుందని చెప్పారు.