"మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం అపారమైన మానవ వనరులను వెలికి తీయగలదు. తద్వారా బలమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి నమూనా నిర్మించగలదు" దీనికోసం పరిశ్రమించాల్సిన అవసరాలపై మహిళా సదస్సు తీర్మానించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. రెండు రోజుల జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల "తిరుపతి డిక్లరేషన్" వివరాలను సదస్సు జాతీయ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలసి లోక్సభ స్పీకర్ ఓంబిర్లా మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో రెండు రోజుల పార్లమెంటరీ, శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. చారిత్రాత్మకంగా మహిళా సాధికారతకు అంకితమైన ఈ పార్లమెంటరీ సదస్సు ముగింపు సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ,
"మహిళల సాధికారత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాకుండా ఆర్థిక అవసరం కూడా" అని ఓం బిర్లా గుర్తు చేశారు. మహిళల సాధికారత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారత మోడళ్ల అవసరాన్ని ప్రస్తావించారు. మహిళా సాధికారితకు స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధమైందని చెప్పారు.
మహిళల నాయకత్వం కీలకం
వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణంలో మహిళల నాయకత్వం, వారి సహకారం కీలకమని తెలిపారు. ఇలాంటి సదస్సులు కేంద్రం, రాష్ట్రాల అనుభవాలను పంచుకునే వేదికలుగా పనిచేస్తాయని అన్నారు. ప్రజాస్వామ్య అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది నాగరికతా విలువ, జీవన విధానం అని లోక్సభ స్పీకర్ ప్రస్తావించారు. భారతదేశం శతాబ్దాలుగా సమానత్వం, సంభాషణ, భాగస్వామ్యం వంటి సూత్రాలను పాటిస్తూ “ప్రజాస్వామ్య తల్లి”గా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
జాతీయ అభివృద్దికి పునాది..
మహిళా సాధికారతను కేవలం సంక్షేమ అంశంగా కాకుండా జాతీయ అభివృద్ధి యొక్క పునాది అనే కోణంలో చూడాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తు చఏశారు. మహిళా విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిన సావిత్రిబాయి ఫూలే వంటి సంస్కర్తల పాత్రను ఆయన గుర్తుచేశారు. మహారాష్ట్రలో వృద్ధ మహిళలకు గ్రామాల్లో విద్య అందించిన పాఠశాలల ఉదాహరణను ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు నేటి విధానాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాల మహిళలు విద్య, వ్యాపారారంభం, సమాజంలో నాయకత్వం వంటి రంగాల్లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, వారికి అవకాశాలు కల్పించినప్పుడు అవి విప్లవాత్మక ఫలితాలు ఇస్తాయని స్పీకర్ అన్నారు. ఈ అవకాశాలను సమాజంలోని ప్రతి వర్గానికి విస్తరించాల్సిన అవసరం ఉందని, తద్వారా మహిళలు భారతదేశ ప్రగతిలో సమాన భాగస్వాములుగా నిలవగలరని అన్నారు.
జండర్ బడ్జెట్ పై ఓం బిర్లా ఏమన్నారంటే..
"లింగ స్పందనాత్మక బడ్జెటింగ్ కేవలం ఆర్థిక పద్ధతి మాత్రమే కాదు, మహిళల అవసరాలను జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో సమగ్రంగా కలిపే సామాజిక-ఆర్థిక మోడల్" అని స్పీకర్ హైలైట్ చేశారు. బడ్జెట్లు మహిళలకు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలను కల్పించేలా ఉండాలని, అవి సామాజిక న్యాయ సాధనాలుగా మారాలని ఆయన అన్నారు. వనరుల కేటాయింపులో లింగ దృష్టికోణం అనుసరించడం ద్వారా మహిళల అవసరాలు అంచున కాకుండా ప్రధాన ప్రణాళికల్లో భాగం అవుతాయని స్పీకర్ పేర్కొన్నారు.
కేటాయింపులు పెరగాలి
విద్య ఇతర రంగాల కోసం మహిళా పురోభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సిన అవసరాన్ని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గుర్తు చేశారు. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర విభాగాల్లో జెండర్ బడ్జెట్ సెల్స్ ఏర్పాటు చేయాలని, మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారారంగం, రుణ సౌకర్యాల కోసం కేటాయింపులను పెంచాలని, ఫలితాలను లింగ ప్రాతిపదికన డేటా ద్వారా పర్యవేక్షించాలని స్పీకర్ సూచించారు. ఇవి బడ్జెట్లను సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధనాలుగా మారుస్తాయని ఆయన తెలిపారు.
డిజిటల్ సాక్షరత మిషన్ అవసరం
కొత్త సాంకేతికతల అవకాశాలు, సవాళ్లను ప్రస్తావిస్తూ, డిజిటల్ యుగంలో మహిళలు వెనుకబడకూడదని స్పీకర్ ఓంబిర్లా అన్నారు. గతంలో వయోజనుల్లో అక్షరాస్యత పెంచడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకున్న విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించారు. అదే కోణంలో మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ప్రత్యేకంగా డిజిటల్ సాక్షరతా మిషన్ అమలు చేయాలని ఆయన సూచించారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సైబర్ భద్రత కల్పించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. పూర్వంలో నిర్వహించిన వయోజన సాక్షరత కార్యక్రమాల మాదిరిగా మహిళలకు ప్రత్యేక డిజిటల్ సాక్షరత మిషన్లను చేపట్టాలని ప్రతిపాదించారు.
రోడ్ మ్యాప్ స్పష్టం
మహిళా సాధికారతకు స్పష్టమైన రోడ్మ్యాప్ను ప్రతిపాదించారని ఓంబిర్లా వెల్లడించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లింగ దృష్టికోణం అనుసరించడం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారారంగం కోసం కేటాయింపులను పెంచడం, జెండర్ స్పందనాత్మక బడ్జెటింగ్ను సంస్థాగతం చేయడం, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు తీర్మానంలో ప్రస్తావించారన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మహిళల STEM రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సైబర్ భద్రతను నిర్ధారించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం, మహిళలను సాంకేతికత సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం కూడా తీర్మానంలో ఉందన్నారు. మహిళా ఆధ్వర్యంలోని అభివృద్ధి కేంద్ర ప్రాధాన్యతగా నిలుస్తుందని పునరుద్ఘాటించిన ఈ తీర్మానం, మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, స్వావలంబనను జాతీయ ప్రగతికి మూలస్థంభాలుగా నిలపడం, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగమని సంకల్పించిందన్నారు.
అనంతరం రెండు రోజుల పాటు సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రతినిధులకు కలంకారి చీరలు, శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ప్రసాదాలను శ్రీ కాళహస్తి ఎం.ఎల్.ఏ బొజ్జల సుదీర్ రెడ్డి, వారి సతీమణి తో కలిసి అందజేశారు.
కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, లైజన్ అధికారులు. వివిధ రాష్ట్రాల డెలిగేట్లు, సూళ్ళూరుపేట, పుట్టపర్తి, జిల్లాల ఎమ్మెల్యేలు, నెలవల విజయశ్రీ, పల్లె సింధూరా రెడ్డి,తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, జిల్లా అధికారులు, రాష్ట్ర శాసనవ్యవస్థకు సంబందించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.