పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నం గ్రామానికి చెందిన 74 ఏళ్ల శివునాయుడు అనే రైతు తన పొలంలో కొబ్బరికాయలు కోయడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే అరటితోటలో ఉన్న ఏనుగుల గుంపు వచ్చి అతడిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు 26న జరిగింది. అలాగే పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో గత అక్టోబర్ 24న ఏనుగుల గుంపు వచ్చిందని చూడటానికి గ్రామస్తులు వెళ్లారు. వారిపై ఏనుగులు దాడి చేయడంతో యాకోబు అనే 72 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఇలా ఇప్పటివరకు ఆ జిల్లాలో 13 మందిని గజరాజులు మట్టుబెట్టాయి. ఈ ఏనుగుల్లో ఆడ ఏనుగులే అధికంగా ఉన్నాయి.
పంటలను ధ్వంసం చేస్తున్న గజరాజులు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆడ ఏనుగులే రాజ్యమేలుతున్నాయి. కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో ఆ మదగజాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మనుషులను చంపేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డగిస్తున్నాయి. ఇలా ఒకటేమిటి? జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొరుకుడు పడకుండా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం 13 ఏనుగులున్నాయి. వీటిలో పది ఆడ ఏనుగులే. మరో మూడు గున్న (పిల్ల) ఏనుగులు. గత ఆగస్టులో ఒకటి, జనవరి నెలలో మరొక ఏనుగు జన్మించగా జూన్ 11న సీతానగరం మండలం సీతారాంపురంలో మరొకటి పుట్టింది. వీటిలో ఆగస్టు, జనవరిల్లో పుట్టినవి మగవి. ఇటీవల పుట్టినది ఆడా, మగా అన్నది ఇంకా అటవీ శాఖ అధికారులు నిర్ధారించలేదు. తమ కడుపున పుట్టిన గున్న ఏనుగుల జోలికి తల్లి ఏనుగులు ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయవు. ఒకవేళ అటువైపు ఎవరైనా వెళ్తే దాడి చేసి హతమార్చడానికైనా వెనుకాడవు. అందువల్ల పుట్టిన ఏనుగు ఆడదా? మగదా? అన్నది తేల్చడానికి అటవీ శాఖ అధికారులు మరికొంతకాలం వేచి చూస్తున్నారు.
బస్సును అడ్డగిస్తున్న ఏనుగు
‘హరి’లో రంగ హరీ..!
కొంతకాలం క్రితం వరకు ఈ అటవీ ప్రాంతంలో హరి అనే ఒకే ఒక్క మగ గజరాజు ఉండేది. ఆ హరే మిగిలిన ఆడ ఏనుగులకు ఏకైక దిక్కుగా ఉండేది. ఆ హరి ద్వారానే అక్కడ సంతానోత్పత్తి జరిగేది. అయితే హరి 2023 నవంబరులో తోటి ఏనుగులను వదిలిపెట్టి ఒడిశా అడవుల్లోకి వెళ్లిపోయింది. ఇక అప్పట్నుంచి హరి తిరిగి రాలేదు. హరి పోతూ పోతూ మూడు ఆడ ఏనుగులతో సంపర్కం జరపడంతో అవి మూడు ఏనుగు కూనలకు జన్మనిచ్చాయి. సాధారణంగా ఆడ ఏనుగు గర్భం దాల్చిన 32 నెలల సుదీర్ఘ కాలానికి ప్రసవిస్తుంది. దీంతో ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా అటవీ ప్రాంతంలో పది ఏనుగులు పెద్దవి, మూడు పిల్ల ఏనుగులు (పాలకొండ డివిజన్లో నాలుగు, పార్వతీపురం డివిజన్లో తొమ్మిది) సంచరిస్తున్నాయన్న మాట! ఏనుగు సగటు జీవితకాలం 80 ఏళ్లు.
ఆ సమయంలో ఆగ్రహంగా ఉంటాయి..
ఆడ ఏనుగులు సాధారణంగా వాటి పిల్లల సంరక్షణ పట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉంటాయి. ఆ సమయంలో అటు వైపు వెళ్తే వాటి పిల్లల జోలికి వస్తున్నారని భావించి క్రూరంగా ప్రవర్తిస్తాయి. వారిని చంపేదాకా వెంటాడతాయి. అలాగే మగ ఏనుగులైతే సంపర్కం కోరుకునే వేళ ఆగ్రహంగా దాడి చేస్తుంటాయి. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఏనుగులకు దూరంగా ఉండడం మంచిదని అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలకు సూచిస్తుంటారు.
ఏడెనిమిదేళ్లలో 13 మంది హతం.. గడచిన ఏడెనిమిదేళ్లలో ఈ మన్యం అటవీ ప్రాంతంలో ఏనుగులు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు కారణమయ్యాయి. అటవీ శాఖ గణాంంకాల ప్రకారం.. ప్రస్తుత మన్యం జిల్లాలో గడచిన ఈ సమయంలో ఏనుగులు 13 మంది స్థానికులను హతమార్చాయి. మరో 40 మంది వరకు గాయపరిచాయి. అంతేకాదు.. దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. సుమారు రూ.3 కోట్ల విలువైన పంటలకు నష్టం చేకూర్చాయి. ఇంకా తరచూ రోడ్లపై వెళ్లే వాహనాలను అడ్డగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆ వాహనాల్లో ఉన్న వారు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. తరచూ ఈ ఐరావతాలు గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తుంటాయి. మరోవైపు ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్న ప్రజలు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాయోనని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఇక రైతుల సంగతి సరేసరి. రాత్రి వేళ గతంంలో మాదిరిగా వారి మకాంలో నిద్రించే సాహసం చేయడం లేదు. తెల్లారి లేచి చూసే సరికి ఎక్కడ ఏ పంటను నాశనం చేస్తాయో? చేశాయోనన్న బెంగతోనే వీరు గడుపుతున్నారు.
జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి?
అడవుల్లో ఉండే ఏనుగులు జనావాసాల్లోకి రావడానికి వాటికి అనుకూల పరిస్థితులుండడమే కారణమని చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న పలు గ్రామాల్లో ఏనుగులు ఇష్టంగా తినే అరటి, చెరకు, వరి, బొప్పాయి, జొన్న వంటి పంటలను బాగా పండిస్తారు. పైగా నాగావళి, వంశధార నదులు సమీపం నుంచి ప్రవహిస్తుండడంతో ఏనుగులకు నీటి వనరులు పుష్కలంగా లభిస్తాయి. ఈ అనుకూల పరిస్థితుల వల్ల గజరాజులు తరచూ ఈ జనారణ్యంలోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి.. మనుషులను చంపేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చిరుధాన్యాలు, మిరప, బంతిపూలు వంటివి సాగు చేయాలని ఆ ప్రాంత రైతులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే అవి అంతగా లాభసాటి కాకపోవడంతో అటువైపు రైతులు ఆసక్తి చూపడం లేదు.
స్పెషల్ షెల్టర్ జోన్కు సన్నాహాలు..
పార్వతీపురం మన్యంలో గజరాజులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక షెల్టర్ జోన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏనుగులు జనావాసాల్లోకి చొచ్చుకు రాకుండా వాటికి ఆహారం, నీరు సమకూరుస్తారు. ఈ షెల్టర్ జోన్ కోసం సీతానగరం మండలం గుచ్చిమిలో 400 హెక్టార్ల అటవీ భూమిని గుర్తించినట్టు జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్వో) జీఏపీ ప్రసూన ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. ఈ షెల్టర్ జోన్ అందుబాటులోకి వస్తే మన్యం జిల్లాలో ప్రజల ప్రాణాలతో పాటు పంటలకు ఒకింత రక్షణ చేకూరుతుంది.. మరోవైపు మదపుటేనుగులను అదుపు చేసేందుకు ఉద్దేశించిన కుంకీ ఏనుగులను మన్యం జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని డీఎఫ్వో తెలిపారు.