తప్పు ఉపాధ్యాయులది... నిర్లక్ష్యం ప్రభుత్వానిది!

పదో తరగతి మూల్యాంకనం ఏపీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.;

Update: 2025-06-01 12:59 GMT
పదో తరగతి మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులు (ఫైల్ ఫొటో)

ఏపీలో పదో తరగతి మూల్యాంకనంలో ఉపాధ్యాయులు చేసిన తప్పుల కారణంగా కొందరు విద్యార్థుల జీవితాలు అగాథంలోకి నెట్టబడ్డాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు పై చదువులకు వెళ్లే అవకాశం లేక ఆగిపోయారు. ఆ విద్యార్థి పాస్ అయినా ఫెయిల్ మార్కులు వేయడం వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.

రాష్ట్రంలో 2025 మార్చి 17 నుంచి 31 వరకు జరిగిన SSC పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23, 2025న విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు సుమారు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, వీరిలో 5.64 లక్షల మంది ఇంగ్లీష్ మీడియం, 51,069 మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. మూల్యాంకనంలో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలో విస్తృత ఆందోళనలను రేకెత్తించింది.

మూల్యాంకనంలో నిర్లక్ష్యం

రీ-వాల్యుయేషన్ దరఖాస్తుల తర్వాత అనేక మంది విద్యార్థుల మార్కులలో గణనీయమైన మార్పులు గమనించబడ్డాయి. ఉదాహరణకు బాపట్ల జిల్లాలోని కొల్లూరు జడ్పి హైస్కూల్ విద్యార్థిని ఎమని తేజస్విని ఐదు సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు సాధించినప్పటికీ, సోషల్ స్టడీస్ లో కేవలం 23 ఫెయిల్ మార్కులు వచ్చాయి. రీ-వాల్యుయేషన్ లో ఆమెకు 96 మార్కులు వచ్చాయి. దీని ఫలితంగా ఆమె మొత్తం స్కోరు 575కి చేరింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11,000 విద్యార్థుల పరీక్షా పత్రాలలో జరిగాయి. దీని కారణంగా34,709 మంది 66,363 జవాడు పత్రాలు కోసం రీ వ్యాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 64,251 రీవ్యాల్యుయేషన్ కోసం కాగా, 2,112 రీ కౌంటింగ్ కింద ఉన్నాయి.

మూల్యాంకనంలో తప్పులు అన్ని కోణాల్లో చూడాలి: ఎస్టీయూఏపీ

పదో తరగతి విద్యార్థుల మూల్యాంకనంలో జరిగిన లోపాలను ఒక వైపు నుంచే కాకుండా అన్ని కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందని రాష్టోపాధ్యాయ సంఘం ఏపీ (STU AP) అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ స్పాట్ వ్యాల్యుయేషన్ లో ఉపాధ్యాయుని మానసిక స్థితిని బట్టి కూడా మార్కులు వేసే అవకాశం ఉంటుందన్నారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతుంటారని, అటువంటి వారు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా మూల్యాంకన డ్యూటీలకు ప్రభుత్వం వేస్తోందన్నారు. అటువంటి వారు పేపర్లు దిద్దే సమయంలో తప్పులు దొర్లే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం ఉపాధ్యాయుని తప్పుగానే తీసుకోకూడదన్నారు. అలాగని విద్యార్థి కోణం నుంచి కూడా ఆలోచించాల్సి ఉందన్నారు. బాగా చదువుకున్న విద్యార్థి ఫెయిల్ అయితే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందన్నారు. రిజల్ట్ ప్రకటించిన సమయంలో ఆ విద్యార్థులు తీవ్ర వత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

అందుకే మానసిక సంఘర్షణలో ఉన్న ఉపాధ్యాయులు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పుడు తప్పకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ పై ఇటువంటి ప్రభావాలు పడటం మంచిది కాదని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో మాదిరి కాకుండా ఉపాధ్యాయ వృత్తి ప్రస్తుతం కత్తిమీద సాములా తయారైందన్నారు.


పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎంత మంది?

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏపీలో 6,14,459 మంది హాజరయ్యారు. రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులు చేసుకున్న వారిలో 11,175 మంది అంటే 16.8 మంది మార్కుల్లో తేడాలు కనిపించాయి. రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్ జరిగిన తరువాత కూడా మళ్లీ మరో 500 మంది రీ వ్యాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

మూల్యాంకనంలో ఒకరు పేపరు దిద్దితే ఇద్వరు పరిశీలన చేస్తారు. అయినా పేపర్ దిద్దిన మాస్టారు వేసిన మార్కులనే కన్ ఫాం చేస్తూ పర్యవేక్షక మాస్టార్లు గుడ్డిగా సంతకాలు చేశారు.

విద్యార్థి ఆందోళనకు గురైతే కారకులు ఎవరు?

చాలా సందర్భాల్లో చూస్తున్నాం. నేను బాగా పరీక్ష రాశాను. అయినా ఫెయిల్ అయ్యాను. నా జీవితం ఎందుకని ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు ఉన్నారు. ఒక వేళ అదే జరిగి ఉంటే అందుకు బాధ్యులు ఎవరు? చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకునేది. ఇంత ఘోర తప్పిదాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు లేవు. ఒకరిద్ధరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 11,175 పేపర్లలో మార్కులు తేడా వచ్చాయి. అంటే ఈ పేపర్లనీ ఒకరిద్దరు ఉపాధ్యాయులే మూల్యాంకనం చేశారా? విచిత్రమైన చర్యలు తీసుకోవడం కూడా విద్యార్థుల తల్లిదండ్రుల్లో చర్చకు దారి తీసింది.

ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలి: ఏఐఎస్ఎఫ్

మూల్యాంకనంలో లోపాల కారణంగా ఫెయిల్ అయి, తిరిగి రీ వ్యాల్యుయేషన్ లో పాస్ అయిన విద్యార్థులు పై కోర్సులకు వెళ్లేందుకు జరిగిన తప్పిదాలను సరిదిద్ది వారికి న్యాయం చేయాలని ఏఐఎస్ఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయికుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు నష్ట పరిహారం కూడా చెల్లించాలన్నారు. వ్యాల్యుయేషన్ సరిగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రతి ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతిభ గల విద్యార్థుల జీవితాలతో ఆటలు: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం

మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిలయ్యారు. వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్, రీ వేల్యూయేషన్ కు ధరఖాస్తులు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది జవాబు పత్రాలను తప్పుల తడకగా దిద్దారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర చెప్పారు. ఎస్సెస్సీ బోర్డు చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. రీ వ్యాల్యుయేషన్, రీకౌంటింగ్ తరువాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైనట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంకన విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. మోక్షిత అనే విద్యార్థినికి సాంఘికశాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి. బాపట్లలో మరో విద్యార్థికి సాంఘిక శాస్త్రంలోనే 26 మార్కులొస్తే రీవెరిఫికేషన్ తరువాత 96 మార్కులొచ్చాయి. ఏలూరులో ఒక విద్యార్ధి రాసిన జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయకుండా 14 మార్కులే వేశారు. రీ వ్యాల్యుయేషన్ లో ఆ విద్యార్థికి 86 మార్కులొచ్చి నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి మంత్రి కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

మూల్యాంకనంలో గుర్తించిన లోపాలు

మార్కుల లెక్కలో తప్పులు: సరైన జవాబులకు మార్కులు వేయకపోవడం లేదా తప్పుగా లెక్కించడం.

కొన్ని పేజీలు దిద్దకపోవడం చేయకపోవడం: కొన్ని ఆన్సర్ షీట్‌లలోని పేజీలు పూర్తిగా మూల్యాంకనం చేయబడలేదు.

ఎడాపెడా గీతలు: సరైన జవాబులను ఎర్ర ఇంకుతో దాట వేయడం లేదా తప్పుగా గుర్తించడం.

ఉపాధ్యాయులపై చర్యలు

మూల్యాంకనంలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్భంలో, విద్యాశాఖ ఐదుగురు మూల్యాంకన కర్తలను సస్పెండ్ చేసింది. ఈ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకన ప్రక్రియ విశ్వసనీయతను కాపాడేందుకు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ చర్యలు తగినంతగా ఉన్నాయా అనే ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రులలో మిగిలిపోయింది. ముఖ్యంగా రీ-వాల్యుయేషన్ ఫలితాలు వెల్లడించే వరకు ఈ లోపాలు గుర్తించబడక పోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ స్పందన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసి, బాధిత విద్యార్థులు నష్టపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. రీ-వాల్యుయేషన్ లో పాసైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (IIIT) వంటి సంస్థలలో ప్రవేశ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన సంస్థలలో ఖాళీలు లేని పరిస్థితిలో ఈ హామీ ఎంతవరకు ఆచరణీయమో సందేహాస్పదంగా ఉంది.

పరీక్షల ఫలితాలపై చర్చ జరగాలి (PAAP)

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ, పరీక్ష ఫలితాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (రిజిస్టర్ నెంబరు 6/2022) (పాప్) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెఎస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్ కోసం విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు చర్చ అవసరమని వారు పేర్కొన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేస్తూ మూల్యాంకన జరగటం దారుణమని అన్నారు. దీనిపై కనీస చర్యలు కాకుండా జీవితాంతం గుర్తుండేలా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలన్నారు.

ప్రజల ఆందోళన

మూల్యాంకనకర్తల నియామకం: అర్హత లేని లేదా తగిన శిక్షణ లేని ఉపాధ్యాయులను మూల్యాంకన బాధ్యతలకు నియమించడంపై విమర్శలు వచ్చాయి. ఇటువంటి నిర్ణయాలు విద్యాశాఖ నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తాయి.

విద్యార్థుల మానసిక ఒత్తిడి: బాగా చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫెయిల్ అయినట్లు చూపటం వల్ల మానసిక ఒత్తిడి, నిరాశ పెరిగాయి. కొందరు విద్యార్థులు తీవ్ర ఆఘాతానికి గురై, ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం: ఫిర్యాదులు వచ్చే వరకు ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని విద్యాశాఖలో ఇటువంటి లోపాలు జరగడం పట్ల తల్లిదండ్రులు మండిపడ్డారు.

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ సవాళ్లు

రీ-వాల్యుయేషన్‌లో పాసైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, అడ్మిషన్ గడువు ముగిసిన సంస్థలలో ఖాళీలు లేని పరిస్థితి సమస్యగా మారింది. ఉదాహరణకు, తేజస్విని వంటి విద్యార్థులు రీ-వాల్యుయేషన్ ఫలితాల ఆలస్యం వల్ల ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ అవకాశాలను కోల్పోయారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక అడ్మిషన్ అవకాశాలను కల్పించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యాశాఖలో నిర్వహణ లోపాలు

ఆంధ్రప్రదేశ్ SSC మూల్యాంకనంలో జరిగిన నిర్లక్ష్యం విద్యాశాఖలోని నిర్వహణ లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. ఈ సంఘటన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలలో అడ్మిషన్ అవకాశాలను కోల్పోయారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వాగతించదగినవి అయినప్పటికీ, మూల్యాంకన ప్రక్రియలో మరింత పారదర్శకత, శిక్షణ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తగిన చర్యలు అవసరం. ఈ సంఘటన భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఒక గుణపాఠంగా ఉపయోగపడాలి.

Tags:    

Similar News