తూటా చేసిన గాయంతో.. ట'మాట' ధర 'పడిపోయింది'
మదనపల్లె టమాటపై అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపించాయి. దీనికి తోడు ఊజీ ఈగ పంట నాణ్యత,ధరను కొంత దెబ్బతీసింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-23 05:24 GMT
చిత్తూరు జిల్లాపై ఉద్యానవన పంటలపై యుద్ధ మేఘాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. యూరోపియన్ దేశాల్లో యుద్ధం వల్ల గత ఏడాది నుంచి మామిడి గుజ్జు నిలువలు పేరుకుపోయాయి. తాజాగా ఇదే సీజన్ లో అధిక దిగుబడిపై కూడా ప్రభావం చూపించింది. దీనికి తోడు జిల్లాలో అక్కడక్కడా టమాటాకు సోకిన ఊజీ ఈగ (FRUIT FLY) వల్ల రైతులను మరింత దెబ్బతీసింది. ఆ కాయలు గ్రేడింగ్ చేస్తేనే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పడం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఆసియా ఖండంలో "మదనపల్లె యాపిల్"గా టమాటాకు ఉన్న పేరు. ఈ మార్కెట్ తరువాత గంటల ప్రయాణానికి దగ్గరలో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ టమాట మార్కెట్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా ప్రస్తుత సీజన్ లోనే చిత్తూరు జిల్లా మదనపల్లె, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాట దిగుబడి పెరిగింది. దీంతో ధరలు రైతులతో దోబూచులాడడడం సహజంగా మారింది.
చిత్తూరు జిల్లాలో 14,588 హెక్టార్లు (సుమారు 36,000 ఎకరాలు) టమాటా సాగు జరుగుతోంది. మదనపల్లె డివిజన్లోనే 22,098 హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. జిల్లాలో పలమనేరు, వెంకటగిరి కోట (వి.కోట), పుంగనూరు, కలికిరి, వాల్మీకిపురం, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు (కురబాలకోట) శాంతిపురం, నిమ్మనపల్లె, బంగారుపాళెం, పీలేరు, పుత్తూరు, రొంపిచర్ల, సోమల, శ్రీకాళహస్తి, వేపంజేరి వంటి మండల కేంద్రాలు, పట్టణాల్లో కూడా టమాట్ మార్కెట్లు కూడా టమాటా వ్యాపారానికి కీలకం.
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్
టమాట మార్కెట్లపై కాశ్మీర్ లోని పహల్ గావ్ వద్ద జరిగిన ఉగ్ర దాడి ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఉగ్రమూకల దాడిలో ఇద్దరు విదేశీయులతో పాటు 28 మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా భారత్ ఒత్తిడి పెంచింది. దీనికి తోడు ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. ఆ కోవలోనే టమాట రవాణా కూడా ఆగింది. కోలార్ మార్కెట్ వ్యాపారులు కూడా ఏమంటున్నారంటే..
"పుల్వామా ఘటన కలిచివేసింది. ఆ తరువాత కూడా మానవతా ధర్మం, వ్యాపార కలాపాల కోసం పాకిస్తాన్ కు టమాటాలు పంపించడానికి వ్యాపారులకు విక్రయించాం. పహల్గావ్ ఘటన తరువాత మా నిర్ణయాన్ని మార్చుకున్నాం" అని కోలార్ వ్యాపారులు అంటున్నారు.
"ఆదాయం లేకున్నా సరే. నష్టం వచ్చినా ఫరవాలేదు. పాకిస్తాన్ కు ఎగుమతి చేయడానికి వ్యాపారులకు టమాటాలు విక్రయించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
"కోలార్ మార్కెట్ నుంచి నిత్యం పాకిస్తాన్ కు వందల టన్నులు టమాటాలు రవాణా చేస్తున్న విషయం నిజమే" అని పుంగనూరు మార్కెట్ కార్యదర్శి గోపి చెప్పారు.
పాకిస్తాన్ గతంలో భారత్ నుంచి కూడా టమాటాలు దిగుమతి చేసుకునేది, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వాఘా సరిహద్దు ద్వారా ఈ వాణిజ్యం జరిగేది. రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సంబంధాలలో మార్పుల కారణంగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
పాకిస్తాన్ రైతులు కూడా సింధ్, బెలూచిస్తాన్, పంజాబ్ వంటి ప్రాంతాలలో టమాటా సాగు చేస్తున్నట్లు వార్తల్లో కనిపిస్తుంది. దేశీయ ఉత్పత్తి డిమాండ్కు సరిపోనప్పుడు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగితే దిగుమతులపై ఆధారపడటం తప్పనిసరి అవుతుందని ఆ ప్రాంత మార్కెట్ సమాచారం.
ఎగుమతి జరిగేతే...
భారత్ నుంచి టమాటాలు ఎగుమతి జరిగినప్పటికీ, నిషేధం తరువాత పాకిస్తాన్ లో ధరల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నట్లు అక్కడి మార్కెట్ సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
2024 జూన్: లాహోర్ లో టమాటా కిలోకు PKR 100 నుంచి PKR 200 వరకు ఉంది. ఈద్ అల్-అధా పండుగకు ముందు ధరలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో PKR 300 వరకు కూడా చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
2025 జూన్ : పాకిస్తాన్ మార్కెట్ సమాచారం ప్రకారం కిలో టమాటా సుమారు 65 పాకిస్తానీ రూపాయల (PKR) నుంచి 490 PKR వరకు ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండిలో కిలో టమాటా 100 PKR నుంచి 490 PKR వరకు ఉన్నట్లు అక్కడి మార్కెట్ ధరలు వివరిస్తున్నాయి. కొన్ని ఆన్లైన్ స్టోర్లలో 65 PKR కి కూడా అందుబాటులో ఉంది.
కలకత్తా మీదుగా బంగ్లాకు రవాణా
దేశీయంగా వ్యాపారులు కొనుగోలు చేసి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాయాది దేశాలకు తరలిస్తుంటారు. మదనపల్లె, అంగళు మార్కెట్ల నుంచి ఢిల్లీ వ్యాపారులు టమాటాలు కొనుగోలు చేస్తారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు కూడా సరిహద్దుల వరకు తీసుకుని వెళితే, ఆ దేశాల ట్రక్కుల్లో లోడింగ్ చేసుకుని తీసుకుని వెళ్లడం సాధారంగా జరుగుతున్న వ్యాపారం.
"మదనపల్లె, అంగళ్లు మార్కెట్ల నుంచి కలకత్తా నుంచి వ్యాపారులు 20 లోడ్లు అంటే 220 టన్నుల టమాటాలు తీసుకుని వెళతారు" అని వ్యాపారి ఎస్.ఏ. మస్తాన్ చెప్పారు. మదనపల్లె ఈ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోని కురబలకోట మండలం అంగళ్లు టమాట మార్కెట్ నాణ్యమైన టమాటాలకు మారుపేరు. ఇక్కడికి పచ్చి, దోరకాయలు రైతులు తీసుకుని వస్తారు. దీంతో వీటికి మదనపల్లె మార్కెట్ కమిటీలో లభించే ధరకు మించి ఉంటుంది.
ప్రస్తుతం బంగ్లాలో అంతర్యుద్ధం కారణంగా మదనపల్లె, కోలార్ మార్కెట్ల నుంచి కలకత్తా, ఢిల్లీకి తరలించే టమాటాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లడం లేదని ఈ ప్రాంత వ్యాపారులు చెబుతున్నారు.
దిగుబడి నిజం.. ధర అవాస్తవం
ఈ సీజన్ లో టమాట దిగుబడి పెరిగింది. వాటికి మంచి ధర లభిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
పుంగనూరులో 15 కిలోల క్రేటు (బాక్సు) రూ. 217 పలికింది. ఇందులో అన్ని ఖర్చులు పోగా, రూ. 80 కూడా దక్కడం లేదు. రెండు మార్కెట్ల పరిస్థితిని పరిశీలిద్దాం.
మదనపల్లి మార్కెట్ కు సాధారణంగా రోజుకు 190-240 మెట్రిక్ టన్నుల టమాటాలు రావాలి.
"ఈ ఏడాది జూన్ 19 నాటికి 13,823 క్వింటాళ్ల టమాటాలు రైతులు తీసుకుని వచ్చారు" అని మదనపల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి అభిలాష్ చెప్పారు.
శనివారం 30 కిలోల క్రేట్ రూ. 500 పలికిందని అభిలాష్ వివరించారు.
పుంగనూరు మార్కెట్కు టమాట్ కు 600 టన్నులకు మించి రావు. శనివారం 850 టన్నులు తీసుకుని వచ్చారని పుంగనూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి పీ. గోపి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు. ఇటీవల 1,800 టన్నులు రావడం పుంగనూరు మార్కెట్ వచ్చిన దిగుబడిలో ఇది రికార్డు అని గోపి చెప్పారు.
మిగిలేది తక్కువే..
ఆ ధరలు పరిశీలిస్తే, గిట్టుబాటు అయిందని భావించడం సహజం అని పుంగనూరు నియోజకవర్గం సోమల మండం చిన్నసోమలకు చెందిన కే. మల్లికార్జునరెడ్డి వ్యాఖ్యానించారు. పుంగనూరు టమాట మార్కెట్ లో క్రేటు (బాక్సు) రూ. 217 పలికింది. అంటే కిలో రూ. 14.70 దక్కింది. ఆయన మాటల ప్రకారం పరిశీలిస్తే..
"నేను మూడు ఎకరాల్లో టమాట సాగుకు తొమ్మది లక్షలు ఖర్చే చేశాను. ధరలు లేక, పంట పొలంలోనే వదిలేశా. ఈ సీజన్ లో మళ్లీ రెండు ఎకరాల్లో సాగు చేశాను. దీనికోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ఇప్పుడు 250 క్రేట్ల కాయలు మార్కెట్ కు తీసుకుని పోయాను" అని మల్లికార్జనరెడ్డి చెప్పారు.
"ఒక క్రేట్ కు కోత, కూలీలు, రవాణా ఖర్చు రూ. 41 మార్కెట్ కు తీసుకుని వెళ్లాక బాక్సుకు కమిషన్ రూ.15, రవాణా ఖర్చు రూ. 15 మొత్తం కలిపితే రూ. 71 అయింది" అని మల్లికార్జునరెడ్డి వివరించారు. అంటే క్రేటుకు నాకు మిగిలింది రూ. 79 మాత్రమే అని వివరించారు.
పొరుగున పెరిగిన దిగుబడి
మదనపల్లె కు పొరుగునే ఉన్న కర్నాటక, తమిళనాడు మార్కెట్లకు భావసారూప్యం ఉంది. కోలారు జిల్లాలో పది వేల నుంచి 20 వేల హెక్టార్లలో టమాట సాగు జరుగుతుంది. కోలార్ మార్కెట్ లో శనివారం వంద కిలోల టమాటాలు రూ.1,200 పలికాయి. పది కిలోలకు రూ. 126 రైతుకు దక్కింది. అంటే కిలో రూ. 12కు పలికినట్లు లెక్క. కోలార్ మార్కెట్ లో జూన్ 18వ తేదీకి కనిష్ట ధర క్వింటాల్ 330 నుంచి గరిష్టంగా రూ.1,730 పలికింది. సగటు ధర క్వింటాల్కు రూ. 1,260 నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
" ఆ రాష్ట్రాల్లో దిగుబడి పెరిగితే మదనపల్లె మార్కెట్ పై ధరల ప్రభావం కనిపిస్తుంది. ఏటా రెండు సీజన్లలో ఇది సాధారణం" అని టమాట మండీ వ్యాపారి మస్తాన్ వివరించారు. దీనికితోడు...
ఊజీ ఈగ ఎఫెక్ట్...
దిగుబడి పెరిగినప్పుడు ధరలు తగ్గడం సహజం. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరిగింది. దీనికి తోడు జిల్లాలోని శాంతిపురం, మదనపల్లెకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో టమాట తోటలకు ఊజీ ఈగ సోకింది. వేసవిలో సస్యరక్షణ చేయడంలో జరిగిన పొరబాటు వల్ల టమాటా పంటకు పువ్వు, మొగ్గ దశలోనే చేరిపోయే ఈగ వల్ల నాణ్యత దెబ్బతినింది. కాండం తొడిమ వద్ద నల్లబారడం వంటి లక్షణాలతో నాణ్యత లేని విషయం బయటపడుతోంది. దీంతో ఆ కాయలు వేరు చేస్తే కానీ కొనేది లేదని వ్యాపారులు చెబుతున్నారు దీంతో టమాటకు గిట్టుబాటు ధర దక్కడం కష్టమైంది.