నాడు ఎమర్జెన్సీకి మద్దతిచ్చిన RSS నేడు వ్యతిరేకిస్తూ మాట్లాడ్డమా !?
సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు రమాదేవి ఎద్దేవా;
తిరుపతి : ఎమర్జెన్సీలో అరెస్టైన వాజ్ పాయ్ పెరోల్ పై ఇంట్లోనే ఉన్నారని, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ పాలనను, సంజయ్ గాంధీ చేస్టలను సమర్థించిన ఆర్ ఎస్ ఎస్ ఇప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడడం పెద్ద పేరడి అని సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు రమాదేవి ఎద్దేవా చేశారు.
ఈ విషయాలన్నిటినీ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి తన పుస్తకంలో బైట పెట్టారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బుధవారం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఇది బిజేపీ వారి రెండు నాల్కల ధోరణి అని, ఇది ఆనాడే కాదు, ఈ నాడు కూడా బైటపడుతోందని విమర్శించారు. దేశాన్ని చీకటి కాలంలోకి తీసుకుపోయిన ఆనాటి ఎమర్జెన్సీ కాలంతో నేటి కాలాన్ని పోల్చడానికి వీలు లేని విధంగా పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘‘సంస్కార్’ సినిమాలో నటించినందుకు ఎమర్జెన్సీలో స్నేహలతా రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టి, ఆమె చావుకు ఇందిర ప్రభుత్వం కారణమైంది. రాజన్ అనే ఇంజినీరింగ్ చదివే కుర్రవాణ్ణి చిత్రహింసలు పెట్టి చంపేశారు. లక్షా 17 వేల మందిని అరెస్టు చేసి మీసా కింద జైల్లో పెట్టారు.
నేడు అప్రకటిత ఎమర్జెన్సీ
నేడు మోడీ పాలనలో గౌరీ లంకేష్, నరేంద్ర ధబోల్కర్, కల్బుర్గీ, పన్సారే వంటి మేధావులను దారుణంగా చంపేశారు. పదహారు లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు రాయితీలుగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, పెంట్రోల్ ధరల పెంపుద్వారా 20 లక్షల కోట్ల రూపాయలను ప్రజల జేబుల నుంచి కొల్లగొట్టింది.’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన గురించి వార్తలు రాశారని ‘న్యూస్ క్లిక్’ పైన దాడి చేశారు. ఆరుగురు జర్నలిస్టుల పైన రాజద్రోహ నేరం మోపుతూ కేసులు పెట్టారు.’’ అంటూ విమర్శించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్యను రాష్ట్రంలోని అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ సమర్థించాయి. కేంద్రం చేసే ప్రతి చట్టానికి వీరు ఉభయులూ మద్దతు తెలిపారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని తెలుగు దేశం ప్రభుత్వం పది గంటలకు, 12 గంటలకు పెంచుతూ పోతోంది. ప్రజాస్వామ్య హక్కులను నాశనం చేస్తోంది. జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితులు తెచ్చిపెడుతోంది. ’’ అంటూ రమాదేశి ధ్వజమెత్తారు.
దేశం మొత్తాన్ని అరెస్టు చేసిన ఇందిర : శైలకుమార్
ఎమర్జెన్సీ కాలమంతా జైల్లో గడిపిన రచయిత శైలకుమార్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ విధించడానికి ముందు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఉద్యమం జరుగుతోందని గుర్తుచేశారు. బీహార్ లోని సమస్తి పూర్ లో జరిగిన సభలో ఎల్ ఎన్ మిశ్రా మాట్లాడుతుండగా బాంబు పేలడంతో అతను మరణించాడని, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో, సుప్రీం కోర్టుకెళ్ళినా ఊరట లబించలేదని, ఈ పరిస్థితిలో జయప్రకాష్ నాయకత్వంలో కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా, ఇందిరా గాంధీ పదవి నుంచి దిగిపోవాలని ప్రజా ఉద్యమం తీసుకొచ్చారని చెప్పారు. ఈ పరిణామాల ఫలితంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి, తన కోసం దేశం మొత్తాన్ని అరెస్టు చేసిందని చెప్పారు.
‘‘ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు వేల మందిని అరెస్టు చేశారు. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఎమర్జెన్సీ విధించారు. ఒక రోజు తెల్లారేసరికి మా ఇంటికి కానిస్టేబుల్ వచ్చి, కింద ఎస్.ఐ ఉన్నారు రమ్మని పిలిచాడు. కిందకు వెళితే ఎస్ ఐ జీప్ ఎక్కమన్నాడు. అప్పటికే ఆ జీపులో త్రిపురనేని మధుసూదన రావు, కరుణాకర్ రెడ్డి(ఇప్పటి తిరుపతిమాజీ ఎమ్మెల్యే), శ్రీధర్, భూమన్ తదితరులున్నారు. ఎక్కడికో చెప్పలేదు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జీప్ బయలుదేరింది కానీ, ఎక్కడికి వెళుతోందీ చెప్పలేదు. మమ్మల్ని చంపేస్తే బయట ప్రపంచానికి తెలుస్తుందని దారిలో మనుషులు కనపడినప్పుడల్లా విప్లవ నినాదాలిచ్చాం. ఒంటికి వెళ్ళాలని జీప్ ను ఆపమంటే, చీకటి పడ్డాక అడవి ప్రాంతంలో ఆపారు. తీసుకెళ్ళి ఎక్కడ ఎన్ కౌంటరు పేరుతో చంపేస్తారోనని మాకు భయమేసింది. అవసరం లేదని జీప్ లోనే కూర్చుండిపోయాం. తెల్లారేసరికి జెడ్ చర్ల వచ్చింది. హైదరాబుకు తీసుకెళుతున్నారని అర్థమైంది. ముషీరాబాద్ జైల్లో పడేశారు. అయితే మమ్మల్ని కొట్టలేదు. జైల్లో ఒకరొకరిని తీసుకొస్తున్నారు. వెంకయ్యనాయుడు,ఇంద్ర సేనా రెడ్డి, వై.ఎస్.రాజారెడ్డి వంటి వారందరినీ జైలుకు తీసుకొస్తున్నారు. మేం ముషీరాబాద్ జైల్లో ఉండగానే 1975 డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున కిష్టయ్య గౌడ్, భూమయ్య గౌడ్ లను ఉరితీశారు. జైలు ఒక పాఠశాలగా, విశ్వవిద్యాలయంగా ఉ ప యోగపడింది. నా మొదటి గేయం జైల్లోనే రాశాను. జైలు అనుభవం నన్నొక రచయితను చేసింది. అయితే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులు ఏమాత్రం భిన్నంగా లేవు’’ అంటూ తన జైలు అనుభవాలను శైలకుమార్ వివరించారు.
నచ్చని ప్రసార మాధ్యమాలను మూసేస్తున్నారు
సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ, 2002లో గుజరాత్ లో జరిగిన మారణ కాండ గురించి పత్రికలు, చానెళ్ళు, ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపీ ప్రభుత్వానికి పరువు పోవడమే కాదు, దేశ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయన్నారు. ఆపరిస్థితులను ఒక గుణపాఠంగా తీసుకుని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఎక్కడ గొడవలు జరిగినా బైటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్ నెట్ ను నిలిపివేస్తూ వస్తున్నారని వివరించారు.
ఢిల్లీలో, ఉత్తర్ ప్రదేశ్లో, కశ్మీర్ లో, మణిపూర్ లో ఎక్కడ ప్రజలు ఆందోళన చేసినా, వాటిని అణిచివేయడంతో పాటు ప్రసార మాధ్యమాల గొంతునొక్కడానికి ఇంటర్ నెట్ ను నిలిపివేశారని గుర్తు చేశారు. వార్తలను నిర్మొహమాటంగా ప్రసారం చేసే ఎన్ డీ టీవీ ఎడిటర్ ప్రణయ్ రాయ్ ఇంటిపైన దాడులు చేయించి, ఆ చానెల్ షేర్లలో అధికభాగాన్ని ఆదానీ కొనేలా చేశారన్నారు. అలాగే దేశంలోని చానెళ్ళ, పత్రికల కార్పొరేట్ యజమానులను తన గుప్పెటలో పెట్టుకుని, నిజాలు బైటికి రాకుండా నొక్కేశారని అన్నారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్తపైన దాడి చేసి ఉపా కింద కేసు నమోదు చేసి జైలు పాలు చేశారని, ఆ సంస్థకు చెందిన 46 మంది జర్నలిస్టులను పదిగంటల పాటు నిర్బంధించి వేధించారని ఆరోపించారు. అలాగే ‘ద వైర్’ ‘న్యూస్ లాండ్రీ’ వంటి నిఖార్సయిన న్యూస్ వెబ్ సైట్ల పైన కూడా దాడులు చేసిందని గుర్తు చేశారు.
ఇటీవల కడపలో తెలుగు దేశం మహానాడు జరుగుతుండగా టీవీ9, సాక్షి చానెళ్ళ ప్రసారాలను సిటీ కేబుల్ ద్వారా నిలిపివేశారని, అలాగే గతంలో వైఎస్ ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్ళను నిలిపివేశారని అన్నారు. ఈ ధోరణులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆరోపించారు.
వీళ్లకి నాటి ఎమర్జన్సీని విమర్శించే హక్కులేదు
సదస్సుకు అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, ఇందిరాగాందీ ఎమర్జెన్సీని ప్రకటిస్తే, ఇప్పటి పాలకులు ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పాలకులకు ఎమర్జెన్సీ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వ్యాఖ్యానించారు. 82 ఏళ్ళ స్టాన్ స్కామిని అరెస్టు చేసి జైల్లో పెడితే, కనీసం స్ట్రా గ్లాస్ కూడా ఇవ్వలేని, ఆయన మరణానికి నేటి పాలకులే కారణమని ఆరోపించారు. అలాగే వికలాంగుడైన సాయిబాబాను కూడా జైల్లో నిర్బంధించారని, చివరికి వరవరరావును కూడా అరెస్ట చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు.