వర్షాలొచ్చాయని లేట్ చేస్తారేమో..
పెండింగులో ఉన్న రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం చంద్రబాబు దేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనేదానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని... ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
నిర్మాణాల్లో వేగంతో పాటు.. నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా.. రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని... ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.