మొంథా విధుల్లో అలసత్వం వద్దు..చర్యలు ఉంటాయ్

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.

Update: 2025-10-27 10:14 GMT

మొంథా తుఫాన్‌ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ తుఫాన్ బులిటెన్లు విడుదల చేస్తూ, అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జెనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వారికి 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామో, తుఫాన్లను ఎదుర్కొనేందుకూ పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా, కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు.
కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాలకు అవకాశం
ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ. దూరంలో ఉన్న మొంథా తుఫాన్...16 కి.మీ వేగంతో తీరానికి చేరువ అవుతోందని... దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయని... మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించినట్టు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. మంగళవారం రాత్రికి తుఫాన్ తీరానికి చేరే అవకాశం ఉందన్నారు. ఎక్కవ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్, ఎస్డీఆర్ దళాలు అందుబాటులో ఉండాలని, ఫైర్ సర్వీసెస్ కూడా అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ టీమ్, రహదారులు-భవనాల శాఖ, విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తతో వ్యహరించాలన్నారు. రహదారులు కోతకు గురైనా, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడినా వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. తుఫాను సమయంలో గర్భిణిలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచి వైద్య సౌకర్యాలు కొనసాగేలా చూడాలన్నారు. యాంటీ స్నేక్ వెనోమ్, యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్లు కూడా అన్ని పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు.
మరోవైపు పంటనష్టం సంభవించకుండా టార్పాలిన్లు విరివిగా ఉంచాలని, పశుసంపద నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 851 జేసీబీలు, 757 పవర్ సాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పగా, ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంచారనేది మ్యాపింగ్ చేయాలని... తుఫాన్ అనంతరం వీటన్నింటి వినియోగంపైనా ఆడిటింగ్ చేస్తామని సీఎం చెప్పారు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రెయిన్లలో బ్లాక్స్ లేకుండా పటిష్టం చేయాలని నిర్దేశించారు.
విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు
‘తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలి. తిత్లీ, హరికేన్, హుద్‌హుద్ తుఫాన్లపై అనుభవాన్ని ఇందుకు వినియోగించాలి. అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు ఎలా నిర్వహించాలనే దానిపై జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. రియల్ టైమ్‌లో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలి. బలమైన గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలిగించాలి.’ అని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. అలాగే తుఫాన్ రక్షణ విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News