అక్రమంగా యానాం నుంచి ఏపీకి డీజిల్‌

పన్నులు ఎగ్గొట్టేవారికి మనం అంటే ఏంటో చూపించాలి అని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.;

Update: 2025-07-18 14:28 GMT

యానాం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా డీజిల్‌ దిగుమతి అవుతుందనే సమచారం ఉందని, ఇలాంటి వాటి పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చే ఆయిల్‌ తదితర దిగుమతులు చేసుకునే వాళ్లు పన్ను వసూళ్లు నుంచి తప్పించుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వాటిని సమర్థవంతంగా అరికట్టాలన్నారు.

మన రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పనితీరు దేశానికే ఆదర్శమని, పనితీరులో ఎవ్వరికీ తీసిపోరని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల సంస్థ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లతో ఏర్పాటు చేసిన రెవెన్యూ వర్క్‌ షాపు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ తమ అనుభవాన్ని ఉపయోగించి సంస్థ మరింత పురోభివృద్ధి చెంది ఆదాయాన్ని ఆర్జించేలా కృషి చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. అధికారులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు చేసుకొనే ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా జీఎస్టీ పన్నుల రెవెన్యూను పెంచాలన్నారు.
ఇందులో ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా అధికారులకు అండగా ఉంటామని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈఏడాది పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించామని ఇందుకు టీమ్‌ గా పనిచేసిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్పిని మునుముందు కూడా కొనసాగించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయ్యిందని, నెలలోపు శాఖ ప్రగతిలో మార్పులు తప్పనిసరిగా కనిపించాలన్నారు.
మన డాటాని ఆధారం చేసుకుని వ్యవస్థలో లోపాలతో పన్నులను ఎగ్గొట్టేవారికి మనం అంటే ఏంటో చూపించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. అదే స్ఫూర్తిని తీసుకుని నేను కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు కూడా సమర్థవంతంగా తమ సేవలను రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు సమర్థవంతంగా అరికట్టే విధంగా ఇతర శాఖలతో కలసి జాయింట్‌ కోఆర్డినేషన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా తనిఖీలతో వాటిని సరిచేయాలన్నారు. ఫీల్డ్‌ లో సమర్ధవంతంగా పనిచేసినప్పుడే మనం ఆశించిన రిజల్ట్స్‌ వస్తాయన్నారు. వాట్‌ పన్నులు పెంచేందుకు పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ రెవెన్యూ వసూళ్లను వసూలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సిస్టమ్‌ లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని పన్ను ఎగ్గొట్టే వారిని నుంచి పన్ను వసూలు చేస్తే రెవెన్యూ పెరుగుతుందన్నారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌ కుమార్‌ మాట్లాడుతూ అధికారులు క్లోజ్‌ గా మోనటరింగ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ ఫైలింగ్‌ అప్పుడు చేసిన డేటా మనకు ఉపయోగ పడుతుందన్నారు. అధికారుల అనుభవం శాఖ రెవెన్యూ పెరిగేలా చూడాలన్నారు. దేశంలో వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన వాణిజ్య పన్నుల శాఖ పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చాలా స్మార్ట్‌ గా పనిచేయాలన్నారు.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ బాబు ఏ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమాచారం ఉపయోగించుకుని రెవెన్యూ రాబడులను పెంచడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లు బాగా పెరిగాయన్నారు. ఇది టీమ్‌ వర్క్‌ గా సిబ్బంది అందరూ పనిచేయడం వల్లే సాధ్యపడిందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అవిశ్రాంత, వినూత్న ప్రయత్నాల కారణంగా జూన్‌ 2025 లో నికర జీఎస్టీ వసూళ్లలో 7.10% వృద్ధిని సాధించిందని బాబు తెలిపారు.
కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ మరియు కార్యదర్శి రవి శంకర్, రాష్ట్ర పన్నుల ప్రత్యేక కార్యదర్శి సౌమ్య నూతలపాటి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ డి. రమేష్, రాష్ట్రంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు చెందిన జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:    

Similar News