సమావేశంలో కమిషనర్, డీఈ బాహాబాహీ.. అసలేమైంది..

పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. అందుకు అక్కడి నుంచి అసెంబ్లీ స్థానానికి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే కారణం.

Update: 2024-08-31 13:31 GMT

పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. అందుకు అక్కడి నుంచి అసెంబ్లీ స్థానానికి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే కారణం. ఆ తర్వాత ఈ నియోజకవర్గం మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కాకపోతే ఈసారి రాష్ట్రవ్యాప్తంగానే హాట్ టాపిక్‌గా మారింది. కాకపోతే ఈసారి ఇద్దరు అధికారుల మధ్య జరిగిన బాహాబాహీ ముష్టియుద్ధం కారణం. ఈరోజు పిఠాపురం మున్సిపల్ సమావేశం జరిగింది. ఇందులో పిఠాపురం పురపాలక సంఘం డీఈ భవాని శంకర్, పురపాలక సంఘం కమిషనర్ కనకారావు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటూ ఒకరిపైకి ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఇప్పుడు మరింత హాట్‌టాపిక్‌గా మారింది. అసలు అధికారిక సమావేశంలో ఇద్దరు అధికారులు తమనుతాము మర్చిపోయేటంత కోపం ఎందుకు వచ్చింది? అంతేకాక ఎదుటి అధికారిపై దాడికి దిగేంతలా సమావేశంలో ఏం జరిగింది? అనేది చర్చనీయాంశంగా మారింది.

పాత విభేదాలే కారణమా..?

కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ మధ్య గతం నుంచే విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఈ భవాని శంకర్ సుదీర్ఘ సెలవు తీసుకున్నారు. వీరి మధ్య అంతకుముందు నుంచే విభేదాలు ఉన్నాయి. డీఈ భవాని శంకర్ ఆఫీసులో ఉన్న సమయంలో కమిషనర్ కనకారావు.. ఈఈతో సంతకాలు చేయించుకునే వారు. అప్పటి నుంచే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. శనివారం నిర్వహించిన పిఠాపురం పురపాలక సంఘం సమావేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతున్న క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇంతలో సహనం కోల్పోయిన ఇద్దరు అధికారులు భీకర బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడం మొదలు పెట్టారు. వీరి వ్యవహారంతో సమావేశానికి హాజరైన అధికారులంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న అధికారులు, కౌన్సిలర్లు వారిని సముదాయించి పక్కకు తీసుకెళ్లారు.

గొడవకు జీతాలే కారణం..

మున్సిపల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అంశంపై చర్చ మొదలైంది. ఈ అంశంపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెప్తూ డీఈ భవాని శంకర్‌పై పలు ఆరోపణలు చేశారు. వెంటనే ఆ ఆరోపణలకు డీఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలోనే వారివురి మధ్య వాగ్వాదం మొదలైంది. కొద్ది క్షణాల్లో అది పెద్ద గొడవగా మారింది. ఆ సమయంలో వచ్చిన కోపంతా వారిద్దరూ విచక్షణ కోల్పోయారు. చేతికి ఏది దొరికితే అది పట్టుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలు కానీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News