ఏపీకి తుఫాను హెచ్చరిక

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.;

Update: 2025-05-22 15:46 GMT

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు.

మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది రానున్న రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని హెచ్చరించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడేఅవకాశాలు ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మే 23 శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురంమన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మే 24 శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
మే 22 గురువారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా కాశిపాడు 29.5మిమీ, విజయవాడ తూర్పులో 25.5మిమీ, కర్నూలు జిల్లా దేవనబండలో 22.5మిమీ, విజయనగరం జిల్లా విజయరాంపురంలో 18మిమీ, కాగంలో 17మిమీ వర్షపాతం రికార్డయిందని కూర్మనాథ్‌ తెలిపారు. 
Tags:    

Similar News