తల్లికి వందనంలో'కరెంట్' కష్టం.. 300 యూనిట్ల పరిమితితో గందరగోళం
భూమి లేకున్నా ఉన్నట్లు చూపించడం, ఇంటిల్లిపాది సపరేటు రేషన్ కార్డులున్నా, హౌస్హోల్డ్ పద్ధతిలో కలిసి ఉన్నట్లు చూపడంతో చాలా మంది అర్హులు అనర్హులుగా మిగిలిపోయారు.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-17 13:25 GMT
"మాకు ఏ నెలలో కూడా కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటలేదు..అయినా 300 యూనిట్లు వాడామంటున్నారు.నాకు తల్లికి వందనం డబ్బులు రాలేదు"ఓ తల్లి ఆవేదన
"నా పేరున అసలు విద్యుత్ మీటరే లేదు. అయితే నా విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా వుందని చూపించారు. ముగ్గురు పిల్లలు స్కూళ్లకు వెళుతున్నా తల్లికి వందనం సొమ్ములు పడలేదు"మరో తల్లి ఫిర్యాదు
ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలలో గ్రామ సచివాలయాలకు ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేయడం , తల్లుల ఖాతాలలో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. అయితే ఇక్కడే తమ ఖాతాలలో డబ్బులు పడని వారు లబోదిబో మంటున్నారు.తమనెందుకు లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గ్రామ సచివాలయాలకు పరుగెడుతున్న తల్లులకు 'కరెంట్ 'షాక్ తగులుతోంది.మీరంతా నెలకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగించారని చెబుతుండటంతో అవ్వాకవుతున్నారు.మేమెక్కడ అంత కరెంటు వాడామంటూ సచివాలయ సిబ్బందిని నిలదీస్తున్నారు.పిఠాపురం మొదలుకొని పలు నియోజక వర్గాలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
చేతులెత్తేస్తున్న విద్యుత్ సిబ్బంది.
ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో సొమ్ములు పడినవారు సంతోషం వ్యక్తం చేస్తుండగా ,సొమ్ము జమకాని తల్లిదండ్రులు కార్యాలయాల బాటపట్టారు. స్థానిక సచివాలయాల్లో ఆరా తీసిన వారికి కరెంట్ ఎక్కువగా వినియోగించారన్న సమాధానం రావడంతో తల్లికివందనం సొమ్మురాని వారంతా విద్యుత్ సబ్ స్టేషన్లకు బారులుకడుతున్నారు.తమ కరెంట్ బిల్లు తక్కువగా వచ్చినా ఎందుకు ఎక్కువగా చూపారని నిలదీస్తూ తమ కరెంట్ స్టేట్మెంట్
ఇవ్వాలని కోరుతున్నారు.దీంతో విద్యుత్ శాఖ అధికారులు తమ చేతిలో ఏమీ లేదని కేవలం ఆరు నెలల మాత్రమే స్టేట్మెంట్ ప్రస్తుతానికి ఇవ్వగలమని తేల్చి చెబుతున్నారు. విద్యుత్ అధికారులు అందజేసిన ఆరు నెలల స్టేట్మెంటును , సచివాలయానికి తీసుకువెళ్లితే సంవత్సరం స్టేట్మెంట్ కావాలని సచివాలయ సిబ్బంది రిజెక్టు చేస్తున్నారు.దాంతో విద్యుత్ కార్యాలయం నుంచి సచివాలయానికి , సచివాలయం నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ కు పరుగులు పెడుతున్నారు.తమ కరెంట్ బిల్లులు ఎక్కువ రాకున్నాఎందుకు అర్హుల జాబితా నుంచి తొలగించారంటూ మండిపడుతున్నారు.. 300 యూనిట్లు పైపడి విద్యుత్ వాడకం నెపంతో తల్లికి వందనం సొమ్ములు నిలుపుదల చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనర్హతకు పలు కారణాలు
తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే.. అందరికి వారి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున ఈ నెల 12న ప్రభుత్వం జమ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల కొందరు అనర్హుల జాబి తాలో వున్నారు.భూమి లేకున్నా ఉన్నట్లు చూపించడం, ఇంటిల్లిపాది సపరేటు రేషన్ కార్డులున్నా, హౌస్హోల్డ్ పద్ధతిలో కలిసి ఉన్నట్లు చూపడంతో చాలా మంది అర్హులు అనర్హులుగా మిగిలిపోయారు. వారం తా సచివాలయాల వద్దకు క్యూ కట్టి తమనెందుకు అనర్హులుగా మిగిల్చారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు అనర్హులైన లబ్దిదారులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
తల్లికి వందనానికి మార్గదర్శకాలు
గత ప్రభుత్వం అమ్మవొడి పథకానికి అమలుచేసిన నిబంధనలనే ,ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.అయితే ఇంట్లో ఎందరు పిల్లలున్నా వారందరికీ పథకం వర్తింపజేస్తోంది.
*కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10000, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12000 మించకూడదు.
*కుటుంబంలోని ఒకరి పేరైనా రేషన్ కార్డులో ఉండాలి.
*మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వర్తించదు.
*మెట్ట భూమి పదెకరాలు లోపు ఉంటేనే అర్హులు. మాగాణి, మెట్ట భూములు రెండూ కలిసి కూడా పదెకరాల లోపు ఉండాలి.
*కుటుంబంలోని ఎవరి పేరు మీదైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే తల్లికి వందనం పథకానికి అనర్హులు
ట్రాక్టర్లు, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు
*నెల వారీ కరెంట్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. సొంతిల్లు అయినా అద్దె ఇంట్లో ఉన్నా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.ఏడాది కరెంట్ వినియోగాన్ని సగటు కింద లెక్కించి.. ప్రామాణికంగా తీసుకుంటారు.
*వేయి చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వర్తించదు.
*కుటుంబంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తున్నా తల్లికి వందనం వర్తించదు
పారిశుద్ధ్య కార్మికులకు ఇందులో నుంచి మినహాయింపు
*పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో పనిచేస్తున్నా వారి పిల్లలకు తల్లికి వందనం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పింఛన్ తీసుకుంటున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం వర్తించదు.
*విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఎన్పీసీఐ లింకింగ్, ఆధార్ సీడింగ్ తప్పనిసరి.
*విద్యార్థులకు 75 హాజరు శాతం తప్పనిసరి. హాజరు శాతం లేకపోతే మరుసటి ఏడాది తల్లికి వందనం అందదు. మధ్యలోనే చదువు ఆపేసినా లబ్ధి చేకూరదు.