కొందరికే కోవిడ్‌ టెస్ట్‌లు!

విశాఖ యోగా డేకి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కొందరికి కోవిడ్‌ టెస్ట్‌లు చేయించారు. లక్షలాది మంది హాజరయ్యే వారికి కోవిడ్‌ పరీక్షలు అవసరం లేదా?;

Update: 2025-06-20 15:43 GMT
కోవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కొన్నాళ్లుగా దేశంలో కోవిడ్‌ మళ్లీ అలజడి సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారం విశాఖపట్నంలో జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ఇక్కడ సాగరతీరంలో యోగాసనాలు చేయడానికి ఎంపిక చేసిన ఐదు లక్షల మందిని తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు, వైద్య బృందాలకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.


అల్లూరి ఎస్పీ అమిత్‌ బర్దర్‌కు కోవిడ్‌ టెస్ట్‌ చేస్తున్న వైద్య సిబ్బంది 

ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ఉన్నత స్థాయి ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమాలకు మెడికల్‌ టీమ్‌లను నియమిస్తారు. ఈ టీమ్‌లో సర్జరీ, ఫిజిషియన్, అనెస్తీషియా, కార్డియాలజీ, న్యూరో మెడిసిన్, అనెస్తీషియా టెక్నిషియన్, స్టాఫ్‌ నర్సు, మేల్‌ నర్స్‌ (ఎంఎన్‌వో) తదితరులు పది మంది వరకు ఉంటారు. ఇలా శనివారం ప్రధాని మోదీ శనివారం నాటి యోగా డే కార్యక్రమానికి విశాఖ కేజీహెచ్‌కు చెందిన పది మెడికల్‌ టీమ్‌లను కేటాయించారు. శుక్ర, శనివారాల్లో విధులు నిర్వహించే వీరందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో అందరికీ కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చిందా? లేక ఎవరికైనా పాజిటివ్‌ తేలిందా? అన్నది బయటకు రాలేదు. కాగా విశాఖ కేజీహెచ్‌లో మెడికల్‌ టీమ్‌కు ఎంపికైన వారిలో కొందరికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, దీంతో వారిని మార్పు చేసి వేరే వారిని నియమించారని సోషల్‌ మీడియాలోను, వాట్సాప్‌ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వైద్యాధికారులు స్పందించడం లేదు. ఈ సీజనులో తొలి కోవిడ్‌ కేసు, తొలి మరణం కూడా విశాఖలోనే నమోదైంది. రాష్ట్రంలోనూ కోవిడ్‌ కేసులు రికార్డవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు విశాఖ కేజీహెచ్‌లోనూ కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారూ ఉన్నారు.
అల్లూరి కలెక్టర్, ఎస్పీలకు కోవిడ్‌ పరీక్షలు..
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్, పోలీస్‌ సూపరింటెండెంట్‌ అమిత్‌ బర్దర్‌లు విశాఖలో శుక్రవారం కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు కోవిడ్‌ టెస్ట్‌లు చేయించుకున్నారో లేదో తెలియదు. ప్రధానితో సన్నిహితంగా ఉండాల్సి కావడం వల్ల వైద్య బృందాలకు కోవిడ్‌ టెస్ట్‌లు చేయించినట్టు తెలుస్తోంది. అయితే ప్రధానితో చేరువగా ఉండే మంత్రులు, ఇతర ప్రముఖులకు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడంపై కూడా స్పష్టత లేదు. ఈ యోగా డే వేడుకలకు ఐదు లక్షల మంది వస్తున్నారు. ఇంత మందితో గిన్నిస్‌ బుక్‌లో నమోదు కోసం ఈ యోగా యజ్ఞాన్ని తలపెట్టారు. యోగా దినోత్సవంలో భాగస్వామ్యమయ్యే వారిలో కొద్దిమందికే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి కోవిడ్‌ పరీక్షలు అవసరం లేదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News