ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కోర్టు సమన్లు

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ పేర్కొన్న కోర్టు.

Update: 2024-10-21 13:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ పేర్కొంది. తిరుమల తిరుపతి కల్తీ లడ్డూ వ్యవహారంలో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఇటీవల తలెత్తిన తిరుమల తిరుపతి లడ్డూ అంశంపై ఉప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఓ రేంజ్‌లో మాట్లాడారు. ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు. 11 రోజుల అనంతరం తిరుమలకు వెళ్లి దీక్షను విరమింప చేసుకున్నారు. అయితే ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఒక న్యాయవాది హైదరబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. లడ్డూ నాణ్యతపై పవన్‌ చేసిన వ్యాఖ్యలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రామారావు అనే న్యాయవాది పిటిషన్‌ వేశారు. ఆధారాలు లేకుండా లడ్డూ నాణ్యతపై వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్‌ లో రామారావు పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ అంశంపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ ను విచారించిన కోర్టు పవన్‌ కళ్యాణ్‌కు సోమవారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల అంటే నవంబర్‌ 22న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.

Tags:    

Similar News