SRIVARI SEVA |ఇక.. కమెండో తరహాలో శ్రీవారిసేవకులు..

స్వచ్ఛంధ సేవకులను మరింత సుక్షితులను చేయాలని టీటీడీ నిర్ణయించింది.దీని కోసం నిష్ణాతులు కూడా రంగంలోకి దిగనున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-30 11:35 GMT
తిరుమలలో శ్రీవారి సేవకులు (ఫైల్)

తిరుమలలో శ్రీవారిసేవను మరింత విస్తృతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఐటీరంగంతో పాటు మెరుపు వేగంతో విద్య, వైద్యం రంగాల్లో కూడా సేవలు అందించడానికి నిపుణులు రంగంలోకి దిగనున్నారు. వారికోసం శ్రీవారిసేవా పార్టల్ లో మార్పులు చేయాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

టీటీడీ నిర్వహిస్తున్న అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు తగినట్లు నిష్ణాతులకు మరింత అవకాశం కల్పించడం, శ్రీవారి సేవకులకు మరింత సుక్షితులను చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ శిక్షణ శిబిరాలతో శ్రీవారి సేవకులను గ్రూప్ లీడర్లుగా తీర్చిదిద్దడానికి కూడా శ్రీవారిసేవకు కొత్తరూపు ఇవ్వడానికి మేధోమథనం జరిగింది.

అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సోమవారం వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, సీఈ శ్రీ సత్య నారాయణ, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, సీఎంఓ శ్రీమతి నర్మదా, డిప్యూటీ ఈవోలు లోకనాథం, శ్రీ రాజేంద్ర, డీఈవో వెంకట సునీలు, ఎస్ వి గోశాల  డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్డిపిపి కార్యదర్శి రామ్ రఘునాథ్  హాజరైన ఈ సమీక్షలో అదనపు ఈఓ అనేక సూచనలు చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా దక్షిణభారత దేశం నుంచి శ్రీవారిసేవకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని అదను ఈఓ వెంకయ్యచౌదరి గుర్తు చేశారు.

వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. "శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చి దిద్దాలి. దీనికి కార్యాచరణ సిద్దం చేయండి" అని సూచించారు. నిపుణులను రంగంలోకి దించడానికి వీలుగా శ్రీవారి సేవ పోర్టల్ ఆధునీకరించమని ఐటీ విభాగాన్ని ఆయన ఆదేశించారు.

"మారుతున్న కాలం, అవసరాలు, అత్యసర పరిస్థితుల్లో కూడా శ్రీవారి సేవకులు మెరుపు వేగంతో స్పందించాలి. అందుకోసం వివిధ విభాగాల్లోని నిపుణులు భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉంది" అని అదనపు ఈఓ గుర్తు చేశారు.

ప్రశాంతినిలయం ప్రేరణతో..

తిరుమలలో టీటీడీ సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది, విజిలెన్స్ వింగ్ మాత్రమే ఉండేది. ఈ పరిస్థితుల్లో యాత్రికులకు సేవలు అందించడానికి మార్గం ఆలోచన చేయాలని తలించారు. టీటీడీ సమాచార పౌరసంబంధాల శాఖ నుంచి డిప్యూటేషన్ పై టీటీడీలో పీఆర్ఓగా వచ్చిన సుభాష్ గౌడ్, టీటీడీ అప్పటి ఏపీఆర్ఓ (ప్రస్తుతం చీఫ్ పీఆర్ఓ) తలారి రవి మధ్య మొదట చర్చ జరిగింది.

శ్రీవారిసేవలో ఏర్పడిన గ్రూప్ లీడర్ షిప్ లో మాట్లాడుతున్న చీఫ్ పీఆర్ఓ తలారి రవి

పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో సేవకుల పద్ధతిపై అధ్యయనం చేయడానికి సుభాష్ గౌడ్ వెళ్లారు. అక్కడి ప్రతినిధులతో మాట్లాడడంతో పాటు, సేవకుల పనితీరును అధ్యయనం చేశారు. ఆ నివేదికను అప్పటి ఈఓకు సమర్పించి, పరిస్థితిని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో..
2000 నవంబర్ లో 200 మందితో టీటీడీలో శ్రీవారిసేవ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి అప్పట్లో చీఫ్ పీఆర్ఓ తలారి రవి ఓఏస్డీగా పనిచేశారు. పోస్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం, సేవకులను రప్పించడంతో పాటు తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల్లో కూడా వారికి విధులు కేటాయించారు. కాలక్రమంలో శ్రీవారి సేవకులను స్వచ్ఛందంగా పనిచేయడానికి 3, 7, 10 రోజల పాటు పది లేదా 15 మంది గ్రూపుగా వచ్చే వారికి క్యూలు క్రమబద్ధీకరించడం, క్యూలో ఉన్నవారికి, కంపార్టుమెంట్లలో నిరీక్షించే యాత్రికులకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, మజ్జగ అందించడంతో పాటు అన్నదానం, శ్రీవారి ఆలయం, వెలుపల, పూలు అల్లడం, కూరగాయలు తరగడం వంటి పనుల్లో స్వచ్ఛందంగా సేవలు అందించడానికి విధులు కేటాయించేవారు.
శ్రీవారి సేవకులకు తిరుమల, తిరుపతిలో వసతి కల్పించే టీటీడీ, వారికి స్వామిదర్శనం కూడా కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో..
టీటీడీలో నిర్వహిస్తున్న శ్రీవారిసేవకు విశేష ప్రాచుర్యం లభించింది. దేశంలోనే కాదు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు పోటీ పెరిగింది.
"ఈ సేవలో పారదర్శకంగా కేటాయించాలనే ఆన్ లైన్ దరఖాస్తులకు శ్రీకారం చుట్టాం" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి చెప్పారు. అందుకు ప్రధాన కారణం కూడా ఉందని ఆయన తెలిపారు.
"శ్రీవారి సన్నిధిలో సేవ చేయడానికి పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య 2.50 లక్షలు దాటింది" అని తలారి రవి వెల్లడించారు. సాధారణ రోజుల్లో దాదాపు రెండు వేల మంది శ్రీవారిసేవకులు అందుబాటులో ఉంటారని, ప్రత్యేక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల వేళ ఆ సంఖ్య 3,500 నుంచి నాలుగు వేల వరకు ఉంటుందని చీఫ్ పీఆర్ఓ రవి చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిన రవాణా వ్యవస్థ దీనికి ఊతం ఇచ్చింది. రోజుకు సగటున 70 వేల నుంచి 80 వేల వరకు యాత్రికుల సంఖ్య పెరిగింది. వారాంతంలో ఆ సంఖ్య మరింత పెరగడానికి, శుక్రవారం అభిషేక సేవ వల్ల సమయం తగ్గినప్పటికీ, 90 వేల వరకు కూడా దర్శనం చేయించడం ద్వారా టీటీడీ అధికారులు, పాలక మండలి రికార్డు నమోదు చేసింది. ఈ పరిస్థితుల్లో..
నాలుగో సేవ
ప్రస్తుతం టీటీడీ శ్రీవారిసేవ ద్వారా మూడు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అందిన దరఖాస్తులను పరిశీలించి, పౌర సంబంధాల విభాగం సేవకులకు అవకాశం కల్పిస్తోంది. శ్రీవారిసేవ, నవనీతసేవ, పరకామణి సేవలకు తోడుగా కమాండో లాంటి గ్రూప్ లీడర్స్, అన్ని వేళల్లో, యాత్రికులు, టీటీడీ నిర్వహించే వివిధ ట్రస్టుల్లో సాంకేతిక, వైద్య విభాగం తరహాలో అన్ని రకాల సేవలు అందించే సుక్షితులను చేయడానికి టీటీడీ సంకల్పించింది.
ఏమి చేస్తారంటే..
పెరిగిన యాత్రికుల సంఖ్యకు తోడు, వారికి ఆరోగ్యంతో పాటు, ప్రశాంతంగా సేవలు అందించడానికి టీటీడీ కార్యాచరణ ప్రారంభించినట్లు ఈఓ శ్యామలరావు చెప్పారు. టీటీడీ నిర్వహిస్తున్న అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు తగినట్లు అందులో నిష్ణాతులకు మరింత అవకాశం కల్పించడం, శ్రీవారి సేవకులకు మరింత సుక్షితులను చేయనున్నామని ఆయన తెలిపారు. అందులో ప్రధానంగా..
"మెడికల్, విద్య, ఇంజినీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుంచి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి" అని గతంలో కూడా ఎన్ఆర్ఐలతో నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ప్రవాసాంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు కోసం ఐటీ అప్లికేషన్ లో అవసరమైన మార్పులు చేయాలన్నారు.
ఆ అనుభవాలు వాడుకుందాం...

టీటీడీలో త మెరుగైన శ్రీవారి సేవపై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈశా పౌండేషన్ , ఆర్ట్ ఆప్ లివింగ్ తదితర సంస్థల నుంచిఅభిప్రాయాలను సేకరించారని, ఆ నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు. శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్దాలని కోరారు.
శ్రీవారిమహాత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవ విధి, విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ జిల్లా స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలలోను, తిరుమలలోను ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
2025 మే 14న ప్రపంచంలోని 14 దేశాల ఎన్ఆర్ఐలతో వర్చువల్ సమావేశం జరిగింది.
టీటీడీ నిర్వహిస్తున్న వైద్య, ఐటీ, ఇంజినీరింగ్, ప్లానింగ్, నీటి వనరులు, ఆహార సాంకేతికత, ఆర్కిటెక్చర్, పట్టణ ప్లానింగ్ లో అంతర్జాతీయ నిపుణులు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి సుముఖత వ్యక్తం చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు పరిపాలన వ్యవహారాల్లో తన అనుభవాన్ని క్రోడీకరించి, సిద్ధం చేసిన ప్రణాళికతో ఎన్ఆర్ఐల నుంచి సానుకూలం స్పందన వచ్చింది.
"తాము అందించే సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో భవిష్యత్తు కార్యాచరణ"ను జర్మనీలో ఉంటున్న సూర్యప్రకాశ్ వివరించారు.
టీటీడీలో సేవల్లో పారదర్శకత తోపాటు, యాత్రికులకు అత్యవసర సమయాల్లో కూడా ఆపన్నహస్తం అందించే లక్ష్యంగా శ్రీవారిసేవను ఆధునీకరించడానికి కార్యక్రమం సిద్ధమైంది. అంతర్జాతీయంగా కూడా సేవల మద్దతును టీటీడీ సమీకరించింది. మారుతున్న కాలం, యాత్రికులకు అవసరమైన సేవలు మెరుపు వేగంతో అందించే సేవకులను సుక్షితులను చేయడం ద్వారా టీటీడీ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి రంగం సిద్ధమైంది.

Similar News