ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల భుజం తట్టి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన చంద్రబాబు

జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ విద్యార్ధులను సీఎం చంద్రబాబు అభినందించారు.;

Update: 2025-08-25 10:13 GMT

జాతీయ స్థాయి ఐఐటీ, నిట్, నీట్‌లో ప్రతిభ చూపిన సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్ధులను భుజం తట్టి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ సీఎం చంద్రబాబు వారిని అభినందించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు.. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలు రూపుదిద్దుకోవాలి. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదు. వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా ఉంది. ఇందుకు 55 మంది విద్యార్థులే నిదర్శనం. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి నాలుగు రెట్లు పెరగాలి. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యాసంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి అని అన్నారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్‌ జిల్లా కుంటముక్కల, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఐఐటీ–నీట్‌ సెంటర్లలో వీరంతా కోచింగ్‌ తీసుకుని ర్యాంకులు సాధించారు. ఈ సెంటర్లలో జేఈఈ మెయిన్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌లో 176 మంది శిక్షణ పొందగా 129 మంది క్వాలిఫై అయ్యారు. నీట్‌కు 180 మంది కోచింగ్‌ తీసుకోగా 143 మంది క్వాలిఫై అయ్యారు. చివరగా ఐఐటీలో 12 మంది, నిట్‌లో 30 మంది, నీట్‌ ఎంబీబీఎస్‌లో 13 మంది విద్యార్ధులు సీట్లు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్ధుల్లో 20 మంది బాలికలు ఉండటం విశేషం. వీరు కాకుండా బీడీఎస్‌లో మరో 14 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. జీఎఫ్‌టీఐ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 19 మందికి సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది కొత్తగా మరో 7 ఐఐటీ–నీట్‌ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే సెంటర్లతో 1,411 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్ధుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్ధులకు మెమొంటోలు, ఒక్కో విద్యార్ధికి రూ.లక్ష చొప్పున చెక్‌ స్వయంగా అందించి వారితో విడివిడిగా ఫోటోలు దిగారు. మొత్తం 55 మంది విద్యార్ధులకు రూ.55 లక్షలు ఇచ్చారు. విద్యార్ధులు అంతా పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భుజం తట్టి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. బోధనా సిబ్బంది, విద్యార్ధులు ముఖ్యమంత్రితో గ్రూపు ఫోటో తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News