చిత్తూరు: కల్లూరు వద్ద ఏనుగులతో తప్పిన భారీ ప్రమాదం

రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సును ఏనుగు అడ్డుకుంది.;

Update: 2025-06-10 05:29 GMT
చిత్తూరు : బస్సుకు అడ్డంగా నిలబడిన ఏనుగు

ఏనుగుల భయంతో పల్లెలు గజగజలాడుతున్నాయి. మూడు రోజులుగా పుంగనూరు పరిసర ప్రాంతాల్లో మకాం వేసిన ఏనుగులు మంగళవారం వేకువజామున ఏకంగా ఓ ప్రైవేట్ బస్సును అడ్డుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో ఆ బస్సు డ్రైవర్, ప్రయాణికులు గజగజలాడి పోయారు.

దాదాపు 15 ఏనుగుల మందు రోడ్డుపైకి వచ్చాయి. నింపాదిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే, చివరగా గున్న ఏనుగు ఎదురుగా రావడంతో ప్రైవేట్ బస్సు ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల మంద దడ పుట్టిస్తుంది. మంగళవారం వేకువజామున అటవీ సమీప ప్రాంతం నుంచి ఏనుగుల మంద రోడ్డుపైకి వచ్చింది. కల్లూరు వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఒక ఆలయం సమీపంలో నుంచి గమనించిన వ్యక్తి ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. రోడ్డుపైకి చేరిన ఏనుగులన్నీ నింపాదిగా నడుచుకుంటూ వెళుతూ ఉండడం కనువిందు చేసింది. అదే సమయంలో బెంగళూరు మార్గం నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా ఉన్న చూసి ఆపివేశారు. లైట్లు కూడా అలాగే ఉంచారు. బస్సు ఇంజిన్ ఆఫ్ చేయడంతో అదృష్టవశాత్తు ఆ గున్న ఏనుగు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
ఏనుగుల మంద ముందుకు రదలగానే బస్సులోని ప్రయాణికులు ఊపిరిపించుకున్నారు. ఏమాత్రం ఈ ఏనుగుల మంద బెదిరి, వాటి దాడులకు దిగి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండేది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణికులు తప్పించుకున్నారు.
కుంకీలు ఏం చేస్తున్నాయి
అడవి నుంచి వచ్చే ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోకుండా నివారించడం. గ్రామీణ నుంచి ఆ ఏనుగులకు ముప్పు లేకుండా అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మదపుటేనుగులను మచ్చిక చేసుకుని, వాటిని దారి మళ్లించడానికి వీలుగా సుక్షిత ఆరు కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకువచ్చారు.
చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చిన కుంకి ఎనుగుల్లో నాలుగు పలమనేరు సమీపంలోని క్యాంప్ లో ఉన్నాయి మరో రెండు తిరుపతి జూ పార్క్ లో ఉన్నాయి. గ్రామాల వైపు వస్తున్న ఏనుగులను దారి మళ్లించడానికి ఈ కుంకీ ఏనుగులను ఇంట్లో రంగం లోకి దించే అవకాశాలు కనిపించడం లేదు. 
"ఈ ప్రాంతానికి, మావటీలకు కుంకీ ఏనుగులు అలవాటు పడాల్సిన అవసరం ఉంది" అని ఓ అటవీ శాఖ అధికారి చెప్పారు.ఈ పరిస్థితుల్లో అడవి నుంచి వచ్చే ఏనుగులను దారి మళ్లించే ఆపరేషన్ నిర్వహించడానికి కుంకీ ఎనుగులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆగని దాడులు
చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతం ప్రధానంగా కుప్పం నుంచి పుంగనూరు వరకు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇదంతా అటవీ ప్రాంతం కావడంతో కర్ణాటక నుంచి ఏనుగులు ఆహారం, నీటి కోసం వస్తున్నాయి. ఆ కోవలో మంగళవారం కూడా సుమారు 15 ఏనుగుల మంద కల్లూరు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అక్కడి రైతుల నుంచి అందిన సమాచారం. మామిడి తోటలు సమృద్ధిగా ఉండడం, కాయల కోత సీజన్ కావడం వల్ల ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. పులిచెర్ల మండలంలో కొన్ని రోజులుగా ఏనుగుల దాడులు ఎక్కువగా ఉన్నాయి. మామిడి చెట్టును కూడా ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్రధానంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

Similar News