కనక దుర్గమ్మ ఆలయ పనుల్లో మార్పులు
పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ పై, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం పనుల పురోగతి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు.;
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తోపాటు ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలంతా కలిసి సమష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారన్నారు. అమ్మవారి ఆలయనికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం దుర్గామల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు.
భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసిజర్లో భాగంగా అన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బల్లలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేశ ఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారన్నారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని.. వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లులో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా, మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని చెప్పారు. వీటిపై వచ్చే సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.
దసరా నవరాత్రులు అనంతరం కృష్ణా పుష్కరాలు నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పనుల్లో మార్పులు, చేర్పులు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఇంజనీర్లు సూచించినందున తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.