ఏపీలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు

జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఈనెల 13న మంత్రుల బృందానికి వినతులివ్వొచ్చని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.;

Update: 2025-08-11 10:46 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మొదటి సారి ఈనెల 13వ తేదీన అంటే బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్‌ హాల్లో సమావేశమౌతోందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్‌ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణ చేసినప్పుడు ఒక నియమం అంటూ పాటించకుండా అడ్డదిడ్డంగా చేసేశారు. దీంతో కొన్ని జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రంకు వెళ్లి పని చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయి. మొత్తంగా జిల్లా, మండల, గ్రామాల పేర్లను మార్చాలంటూ, వాటి సరిహద్దులు మార్చాలంటూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమిప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపేందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్‌ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తోపాటు మరో ఆరుగురితో మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటు చేసింది. ఈ జీవోఎంలో మంత్రి అనగానితోపాటు మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ, హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, నీటి వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సభ్యులుగా ఉన్నారు.

వీరంతా ఈనెల 13వ తేదీన మొదటి సారి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రజలుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ జిల్లా, మండల, గ్రామాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పుపైన వారి వినతులను సచివాలయానికి వచ్చి జీవోఎంకు సమర్పించవచ్చు అని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.


Tags:    

Similar News