సింగపూర్‌లో చంద్రబాబు రెండు గంటల కాలినడక

ఉత్తమ విధానాలతో ఏపీ భవిష్యత్‌ నగరం అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-07-28 09:03 GMT

రెండో రోజు సింగపూర్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు. సోమవారం సింగపూర్‌లో 10 వేల కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్‌ను సీఎం బృందం సందర్శించింది. సిటీ ఇన్‌ ఎ గార్డెన్‌ పేరుతో ఏర్పాటైన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్‌ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్‌ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన సందర్శించారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్‌ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్‌ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అమరావతి కోసం సింగపూర్‌ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ సింగపూర్‌–ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

బిడదారి ఎస్టేటులో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టిన విధానాన్ని సింగపూర్‌ అధికారులు చంద్రబాబుకు వివరించారు. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా.. ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవడంతో పాటు.. ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు చేపట్టామని ఆ దేశ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గృహ సముదాయాల నిర్మాణం ఖర్చు ఏ మేరకు ఉందనే అంశం పైనా చంద్రబాబు వారితో చర్చించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడడంతో పాటు.. నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాల చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్‌ అధికారులు చెప్పారు. బిడదారి హౌసింగ్‌ ప్రాజెక్టును సింగపూర్‌ హౌసింగ్‌ డెవలప్మెంట్‌ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. సింగపూర్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్‌ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణ హితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా సింగపూర్‌ అర్బన్‌ రీడెవల్పమెంట్‌ అథారిటీ మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు.
బిడదారి హౌసింగ్‌ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్‌ హౌసింగ్‌ డెవలప్మెంట్‌ బోర్డు, సింగపూర్‌ అర్బన్‌ రీడెవలప్మెంట్‌ అథారిటీ, సింగపూర్‌ కార్పోరేషన్‌ ఎంటర్‌ ప్రైజ్‌ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో సింగపూర్‌ సహకారంపై ఈ భేటీలో చర్చించారు. ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్‌ హౌసింగ్‌ డెవలప్మెంట్‌ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు. బిడదారి ప్రాజెక్టును రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందన్నారు.
Tags:    

Similar News