హార్ట్‌లీ వెలకమ్‌ మోదీజీ అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు

ప్రధాని మోదీకి హృదయపూర్వక స్వాగతం..కేంద్రం సహాయం ఎన్నటికి మరువలేనిదని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు అన్నారు.;

Update: 2025-05-02 05:11 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్న వేళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. తమ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. మనసులోని సంతోషాన్ని ఓ ట్వీట్‌ ద్వారా పంచుకున్నారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ ఉత్సవానికి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రియేట్‌ చేసే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా అమరావతి నిలబడుతుంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ రాజదాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అంటూ మోదీ రాక సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ఓ మెస్సేజ్‌ పెట్టారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతి రూపంగా అమరావతి అంటూ పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అమరావతికి మోదీ రాక సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
పవన్‌ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతి రూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. అంటూ పోస్టులో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
Tags:    

Similar News