ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, 17 జిల్లాల్లో 41డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5డిగ్రీలు, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 42.8డిగ్రీలు, ఏలూరులో 42.6డిగ్రీలు, విజయనగరం జిల్లా ధర్మవరంలో 42.5డిగ్రీలు, తిరుపతి జిల్లా గూడూరు 42.3డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పల్నాడు 21 ప్రాంతాల్లో, ఎన్టీఆర్ 15, ప్రకాశం 12, బాపట్ల 9, గుంటూరు 8 సహా ఇతర చోట్ల కలిపి 116 ప్రాంతాల్లో 41డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు.
మే 13న మంగళవారం 42డిగ్రీల నుంచి 43.5డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు ఉంటాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 2, పార్వతీపురంమన్యం జిల్లాలో 11, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 1 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలు, విజయనగరం జిల్లాలో 14 మండలాలు, పార్వతీపురంమన్యంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 7 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 22 మండలాల్లో తీవ్ర వడగాలులు, 36 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోవడం కానీ, రూమాలు కట్టుకోవడం కానీ చేయాలన్నారు. తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
మరోవైపు మంగళవారం రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ప్రజలు నిలబడరాదని రోణంకి కూర్మనాథ్ సూచించారు.