బోండా ఉమా వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయి
తన ఛాంబర్లో పవన్ కల్యాణ్ పీసీబీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయనీ, వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు తనకు అనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. శాసన సభలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అనంతరం అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు పారిశ్రామిక కాలుష్యం గురించి ప్రస్తావించి, పీసీబీ ఛైర్మన్ డా కృష్ణయ్యపై చేసిన వ్యాఖ్యలౖ మీద ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని తన పేషీలో పవన్ కల్యాణ్ పీసీబీ ఛైర్మన్, అధికారులతో సమీక్షించారు. పీసీబీ ఛైర్మన్ గురించి ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయనీ, వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు తనకు అనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని డా కృష్ణయ్యను ఉప ముఖ్యమంత్రి అడిగారు. దానికి కృష్ణయ్య బదులిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రెబ్స్ బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పీసీబీ విచారణ చేపట్టి చర్యలు చేపట్టడం, తదనంతర పరిణామాలు వివరించారు. ఇందుకు సంబంధించిన అంశాలతో సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని, వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించి, నిబంధనలు అమలయ్యేలా చూస్తాము.. అంతేగానీ పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి, వారు పారిపోయే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకురాదు. వెళ్లిపోయిన పాలకుల విధానాలను అనుసరించాలని ఎవరైనా భావిస్తే కూటమి పాలనలో అది సాధ్యం కాదని పవన్ కల్యాణ్ తెలిపారు.