బీజేపీ మాధవ్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడే...
టీడీపీతో ముడి పడిన బీజేపీ రాజకీయాలు;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (P.V.N. Madhav) సన్నిహితుడని సమాచారం. మాధవ్ కుటుంబం బీజేపీతోనే ఉన్నప్పటికీ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో మాధవ్ ముందున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మాధవ్ చంద్రబాబును పలు మార్లు కలిసి పార్టీకి కావాల్సిన అవసరాల గురించి చెబుతున్నారు.
బీజేపీలోని పెద్దల సూచనల మేరకు ఆయన కలుస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్నేహితులు, శిశ్యులు, సన్నిహితులను నేరుగా వేరే పార్టీల్లోకి పంపించి అక్కడ వారిని రాజకీయంగా ఎదిగేలా చేసి కావాల్సిన పనులు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్కబెట్టుకోవడంలో ముందుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన వారు ఉన్నారు. జనసేన పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు సీట్లు ఇప్పించి తన మనుషులను గెలిపించుకున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మాధవ్ సన్నిహిత సంబంధాలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు మాధవ్ ను అభినందిస్తూ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రాజకీయ జీవితం
మాధవ్ రాజకీయ జీవితాన్ని ఆర్ఎస్ఎస్తో ప్రారంభించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) లో 2003-2007 మధ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా, 2007-2010 మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010-2013 మధ్య జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
శాసన మండలి సభ్యుడుగా (ఎమ్మెల్సీ)గా 2017-2023లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు.
పీవీఎన్ మాధవ్ బీజేపీలో రెండవ తరం నాయకుడు. ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి పీవీ చలపతి రావు 1980-1986 మధ్య ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
చంద్రబాబుతో సంబంధం
చంద్రబాబు, పీవీఎన్ మాధవ్ మధ్య సంబంధం ప్రధానంగా ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడింది. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మధ్య సీటు షేరింగ్ ఒప్పందం జరిగింది. దీనిలో టీడీపీ 144 సీట్లు, జనసేన 21 సీట్లు, బీజేపీ 10 సీట్లు పంచుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. చంద్రబాబు 2024 జూన్ 12న నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో బీజేపీ నాయకులైన జేపీ నడ్డా, అమిత్ షా, ఇతరులు హాజరయ్యారు. పీవీఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఈ కూటమి బలాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే మాధవ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీజేపీలో బలమైన పట్టు సంపాదించిన నాయకుడుగా ఉన్నారు.
గత రాజకీయ ఘర్షణలు
2019లో చంద్రబాబు నాయుడు బీజేపీపై విమర్శలు చేసిన సందర్భంలో పీవీఎన్ మాధవ్, అప్పటి బీజేపీ ఎమ్మెల్సీగా, చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2004లో అలిపిరి దాడి గురించి చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మాధవ్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఈ ఘర్షణలు తగ్గాయి. ఇరు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఐక్యంగా పనిచేశాయి.