బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌

ముగ్గురు మోదీ తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.;

Update: 2025-08-22 08:11 GMT

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌ అని, ముగ్గురూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొత్తులే అని, బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

షర్మిల ఏమన్నారంటే..
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ బీ–టీం అని నిజ నిర్ధారణ జరిగింది. ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైంది. బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది. అందుకే బీజేపీ అంటే ‘బాబు–జగన్‌–పవన్‌‘. ముగ్గురు మోదీ తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు. వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలి. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు. 5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారు. ఈ దేశంలో ఓట్‌ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీ నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోదీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోదీ ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదికి మద్దతు ఇస్తారా? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలి.. అంటూ శుక్రవారం వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News