ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది
ఆంధ్రప్రదేశ్లో పేదలకు వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని షర్మిల మండిపడ్డారు.;
By : The Federal
Update: 2025-04-07 05:51 GMT
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం మీద, దానిని అమలు చేస్తోన్న నెట్ వర్క్ ఆసుపత్రుల మీద కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నెట్వర్క్ ఆసుప్రతుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయే దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిందని, దీని వల్ల రాష్ట్రంలోని పేదలకు నెట్ ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షగా మారిందని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
షర్మిల ఏమన్నారంటే..
పేరుకు రైజింగ్ స్టేట్..కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుంది. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యింది.
వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోండి. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతి చెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోండి. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటూ షర్మిల పేర్కొన్నారు.