ఏపీ లిక్కర్ కేసు..సిట్ సోదాలు
భారతీ సిమెంట్స్ కార్యాలయం కేంద్రంగానే ఈ స్కామ్కు స్కెచ్ వేశారనే అనుమానాలతో తనిఖీలకు తెరలేపారు.;
By : The Federal
Update: 2025-07-26 13:36 GMT
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆరుగురు సిట్ అధికారులు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు కాబడి రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పకు సంబంధించిన హైదరాబాద్లోని ఇళ్లు, కార్యాలయాల్లో శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీల్లో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేశారు.
ఈ కార్యాలయాల్లోను, ఇళ్లల్లోను నిందితులుగా ఉన్న రాజ్కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, మాజీ అధికార్లు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలతో పాటు వైసీపీ నాయకులు ఎవరెవరు మీటింగ్లు పెట్టుకునేవారు, ఆ సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యే వారు, ఎన్ని సారు సమావేశాలు నిర్వహించుకున్నారు, ఎన్ని సార్లు హాజరయ్యారు వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలతో వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎక్కువుగా భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించారనే ఆరోపణల ఆధారంగా బాలాజీ గోవిందప్ప కార్యాలయమైన బంజారా హిల్స్లోని భారతీ సిమెంట్స్ పరిపాలన కార్యాలయంలో చేపట్టారు. అందులో భాగంగా అక్కడ డాక్యుమెంట్లను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు క్షుణ్ణంగా పరీలించే ప్రయత్నం చేశారు. భారతీ సిమింట్స్ కార్యాలయం నుంచే దాదాపు ఆరు డెన్లకు పెద్ద ఎత్తున ముడుపులు తరలించారని, డిస్టలరీ సంస్థల వ్యాపారస్తులతో కూడా పలు మార్లు సమావేశాలు నిర్వహించారని ఇది వరకు చేపట్టిన తమ విచారణలో గుర్తించిన సిట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు.