ఏపీలో 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు
యూరియా సరఫరా,ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై, ఆర్జీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;
By : The Federal
Update: 2025-09-08 15:21 GMT
రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు, కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటలపాటు అధికారులతో దాదాపు 5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,
మరో పది రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 రేక్ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 50 వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లైంది. వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువుల పంపిణీకి సంబంధించి భరోసా ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు, కౌలు రైతులు ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా.. నిల్వచేసి పెట్టుకోకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు.
ఉల్లి కొనుగోళ్లు పై దృష్టి పెట్టాలి
కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు మద్ధతు ధరపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర తగ్గకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరైనా ఆ ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉల్లి పంట ఉత్పత్తి అంచనాల మేరకు నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లతో పాటు మార్కెట్ కు కూడా తరలించాలని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ ఘటనలో డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. పంటను కనీస మార్కెట్ తేకుండానే పురుగుమందు తాగినట్టుగా డ్రామా చేసిన వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు అరకులో కాఫీ పంటకు సోకిన కాయతొలుచు పురుగు తెగులుపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే తెగులు సోకిన 60 ఎకరాల్లో పంట తొలగించామని మరో 20 ఎకరాల్లో తొలగింపు ప్రక్రియ జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. అలాగే తురకపాలెం గ్రామంలో తలెత్తిన ఆరోగ్య పరిస్థితిపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. దీన్ని కేస్ స్టడీగా తీసుకుని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ప్రతీ వారం సమీక్షలు
ప్రభుత్వ విభాగాలు అందించే వివిధ పౌరసేవల్లో సంతృప్తి స్థాయిలపై ఇక ప్రతీవారం సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఆర్టీసీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇలా వేర్వేరు శాఖల్లో అందిస్తున్న సేవలపై ఇంకా సంతృప్తి స్థాయి పెరగాలని సీఎం పేర్కొన్నారు. కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లు ఏమేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఉపకరిస్తున్నాయన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ నుంచి నిర్వహించిన సమీక్షకు సీఎస్ కే.విజయానంద్ సహా వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యశాఖ, మార్కెటింగ్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
యూరియాపై టెలీకన్ఫరెన్స్
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి యూరియా సరఫరా, లభ్యతపై రైతులకు నమ్మకాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే భూసారం కూడా దెబ్బతింటుందన్న అంశాన్ని రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కొందరు రైతులు రబీ కోసం కూడా ఇప్పుడే కొనుగోలు చేయకుండా చూడాలని అన్నారు. రబీ పంట కోసం ముందస్తుగానే ఎరువులను సిద్ధం చేస్తున్నట్టు సీఎం పేర్కోన్నారు. ఎక్కడా రైతుల్లో ఆందోళన లేకుండా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. సీజన్ లో సాగునీరు ముందుగానే ఇవ్వటం వల్ల పంటల సాగుకూడా ఎక్కువ చేశారని.. వాణిజ్య పంటలైన ఉల్లి, మామిడి, మ్యాంగో, టమాటో, చీని కాయల ఉత్పత్తి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని .. దీనికి స్వల్ప, మధ్య, ధీర్ఘ కాలిక ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా సహా విష జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.