ఆస్కార్ కమిటీ సభ్యుడిగా కమల్ హసన్ అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
సినీరంగంలో దశాబ్దాల కృషి అనంతరం ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా కమల్ కు ఆహ్వానం లభించింది.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-29 11:54 GMT
దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా ఆయనకు ఆహ్వానం లభించింది.సినీ అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని అనేక ప్రాంతీయ, జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కమల్కు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా కమల్ కు ఆస్కార్ కమిటీ సభ్యుడిగా ఆహ్వానం రావడంపై ఆయనను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డు-2025 కమిటీ సభ్యుడిగా పద్మభూషణ్ కమలహాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. ఆరు దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనా జీవితాన్ని గడిపిన కమల్ హాసన్ గారు కేవలం నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటుడిగా చిత్రనిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన అసాధారణమైన పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజమైన కళాత్మక నిపుణుడు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాకు ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను.' అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.