బంగాళాఖాతంలో బలపడిన మరో అల్పపీడనం

ఐఎండీ సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

Update: 2024-10-21 13:38 GMT

ఐఎండీ సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్రంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా తెలిపారు. ఇది అక్టోబర్‌ 22 నాటికి పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి, బుధవారం నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇది అక్టోబర్‌ 24వ తేదీ రాత్రి శుక్రవారం తెల్లవారుజాము నాటికి తీవ్రతుపానుగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల సమీపంలో పూరీ, సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్, ఫిషరీస్, పవర్, పోర్ట్స్, పెట్రోలియం–నేచురల్‌ గ్యాస్‌ శాఖల కార్యదర్శులు, ఎన్డీఎంఏ మెంబర్, డిఫెన్స్‌ , డీజీ ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, డీజీ ఐఎండి, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో తీసుకున్న ముందస్తు చర్యలను సిసోడియా వారికి వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ , ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
Tags:    

Similar News