12 ఏళ్లు నిండిన వారికే అడ్మిషన్లు
సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ సోర్ట్స్ స్కూల్ను సందర్శించింది.;
By : The Federal
Update: 2025-07-28 08:39 GMT
రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పరిశీలించింది. సింగపూర్ లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ సందర్శన అనంతరం సింగపూర్ స్పోర్ట్స్ స్కూలును కూడా సందర్శించి పరిశీలించారు. చంద్రబాబు బృందంలో ఒలింపిక్ చాంపియన్ పుల్లెల గోపిచంద్, మంత్రులు, ఏపీ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వినోదం, పర్యాటకం కోసం కాకుండా అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేసేలా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని సీఎం అన్నారు.
ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్ ప్రయత్నిస్తోందని సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ వివరించారు. ఉన్నత ప్రమాణాలు.. అత్యున్నత పనితీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకుని స్పోర్ట్స్ స్కూల్ నడుపుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులకు స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని సీఎంకు తెలిపారు. జాతీయ క్రీడా అసోసియేషన్లు, అకాడెమీలతో ఇలాంటి స్కూళ్లు పనిచేసేలా తీర్చిద్దామని వివరించారు.
విద్యార్ధులకు 12 ఏళ్లు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత వారికి వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్టు వెల్లడించారు. క్రీడా విభాగం, విద్యాశాఖల నుంచి ఈ తరహా స్పోర్ట్స్ స్కూళ్లకు నిధులు సమకూరుస్తున్నాయని ప్రిన్సిపల్ సీఎంకు తెలిపారు. అంతర్జాతీయంగా ఖతార్లో ఈ తరహా స్పోర్ట్స్ స్కూల్ ఉత్తమ విధానాల్ని అనుసరిస్తోందని సీఎం చంద్రబాబుకు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ నిర్వాహాకులు తెలిపారు.