శ్రీవారి దర్శనాల్లో అరుదైన రికార్డు
తిరుమలలో శుక్రవారాల్లో తక్కువ సమయంలోనే వేల మందికి శ్రీవారి దర్శనం ఎలా సాధ్యమైంది.;
By : SSV Bhaskar Rao
Update: 2025-06-14 11:09 GMT
శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ అధికారులు తీసుకున్న చర్యలతో ఈ ఏడాది వేసవిలో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. సాధారణ స్థాయికి మించిన సంఖ్యలో యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పించారు.
టీటీడీ అధికారుల ముందస్తు ప్రణాళిక ఈ ఏడాది వేసవిలో ఫలించింది. తిరుమలలో శుక్రవారం అభిషేక సేవ వల్ల సమయం తగ్గుతుంది. కానీ, వేల మంది యాత్రికులకు దర్శనం కల్పించారు. ఇది ఎలా సాధ్యమైంది? భవిష్యత్తులో ఇదే పద్ధతి అనుసరిస్తారా?
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి దేశ, విదేశాల్లో అశేష భక్తులు ఉన్నారు. వేసవి సెలవుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. రోజుల తరబడి క్యూలలో నిరీక్షించే పరిస్థితి ఏర్పడుతుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం అభిషేక సేవ ఉంటుంది. దీనివల్ల సాధారణ రోజులతో పోలిస్తే, సామాన్య యాత్రికులకు కల్పించే దర్శనంలో రెండు నుంచి మూడు గంటలు తగ్గుతుంది. దీనివల్ల 60 వేల నుంచి 65 వేల మందికి దర్శనం కల్పించడం సాధ్యం అవుతుంది. టీటీడీ అధికారులు తీసుకున్న చర్యల వల్ల ఆ సంఖ్యకు మించి యాత్రికులకు దర్శనం కల్పించారు.
దర్శన వివరాలు పరిశీలిస్తే..
తిరుమలలో శుక్రవారం అభిషేక సేవ వల్ల దర్శన సమయం తగ్గుతుంది. అయితే, ఆ రోజుల్లో తీసుకున్న చర్యల వల్ల శుక్రవారం మే 23వ తేదీ 74, 374 మంది దర్శించుకున్నారు. మే 30వ తేదీ 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్టు వివరించారు. అవన్నీ ఒక ఎత్తైతే..
జూన్ 13 తిరుమలో సరికొత్త రికార్డు దర్శనాలు కల్పించారు. 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం అని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు.
"తిరుమలలో ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంచాం. టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వచ్చిన శుక్రవారాల్లో దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శనం కల్పించడానికి వీలు కుదిరింది" అని వివరించారు.
వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే నెల 15 వ తేదీ నుంచి విపరీతంగా పెరిగింది. అయినా, ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు దర్శనం కల్పించడం ద్వారా యాత్రికులకు ఇబ్బంది లేకుండా చేశారు. అందుకు ప్రధానంగా, వేసవి సెలవులో నేపథ్యంలో టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంది.
1. వీఐపీ సిఫారసు లేఖలు రద్దు చేసింది.
2. ప్రజాప్రతినిధుల లేఖలకు కూడా విరామం ప్రకటించారు.
3. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వారికి దర్శనం కల్పించారు.
4. సిఫారసు లేఖలు స్వీకరించలేదు.
దీనిల్ల ఆ సమయం కలిసి రావడం వల్ల సామాన్య యాత్రికులకు టైంస్లాట్ టోకెన్లు లేకున్నా, గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పించడానికి వెసులుబాటు కలిగిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఏడాది మే నెల 16వ తేదీ నుంచి మళ్లీ సిఫారసు లేఖలు అనుమతించారు. దీనికి తోడు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లేఖలకు దర్శనం, వసతి సదుపాయాన్ని పునరుద్ధరించారు. దీనికి తోడు వేసవి సెలవులు ముగింపునకు వచ్చే కొద్దీ తిరుమలలో రద్దీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో అంతకుముందు 15 రోజుల పాటు సామాన్య యాత్రికులకు దక్కిన వరంలాంటి దర్శన సదుపాయంలో ఇబ్బంది ఏర్పడింది. 14 నుంచి 24 గంటల వరకు దర్శన సమయం పట్టింది. రద్దీ వేళల్లో ముందస్తు చర్యలు తీసుకునేందుకు టీటీడీ యంత్రాంగానికి ఓ అవగాహనకు ఆస్కారం కల్పించాయి.
తిరుమలలో రోజూ వారి, వారాంతపు సేవలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ మంది సామాన్య యాత్రికులకు దర్శనం కల్పించడానికి చేసిన ప్రయోగం ఓ రకంగా ఫలించిందని చెప్పవచ్చు.