8రోజులు సమావేశాలు,23 బిల్లులు–నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
By : The Federal
Update: 2025-09-27 14:34 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినట్టు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన పలు కీలక చర్చలు, నిర్ణయాలు చోటుచేసుకున్నాయి. సభ ముగిసిన అనంతరం స్పీకర్ మొత్తం 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టబడ్డాయని, అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. అలాగే మూడు బిల్లులను ఉపసంహరించినట్టు పేర్కొన్నారు. సభ్యుల విశ్లేషణతో ఆరు అంశాలపై లఘు చర్చలు జరిగినట్టు స్పీకర్ వెల్లడించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
స్పీకర్ ఛాంబర్లో సీఎం చంద్రబాబు భేటీ
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులను వారి ఛాంబర్లో కలిశారు. సమావేశాల నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో సభ్యుల సదుపాయాలపై కమిటీ చేసిన సూచనల వివరాలు సీఎంకు వివరిస్తూ, వాటిని అమలు చేయాలన్న అభిప్రాయాన్ని స్పీకర్ వ్యక్తం చేశారు. అంతకుముందు, శాసనసభ ముగింపు సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటోను ముఖ్యమంత్రికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ కలిసి అందజేశారు. సభా కార్యక్రమాల ముగింపుని గుర్తుగా ఈ ఫోటోను అందజేయడం గమనార్హం.