3వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రాధాన్యతపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు.;
By : The Federal
Update: 2025-06-17 09:12 GMT
ప్రతి ఏటా 3వేల టీఎంసీలకు తగ్గకుండా గోదావరి నీరు సముద్రంలో వృధాగా కలిసి పోతోందని, గత 50 ఏళ్లుగా వేలాది టీఎంసీల గోదావరి నీరు వృధా అయిపోతోందని, ఇలా వేస్టుగా సముద్రంలో కలుస్తున్న నీటిలో 200టీఎంసీల నీటిని బనకచర్లకు తరలించాలనేదే ఈ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడుతూ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపైన ప్రజల్లో లేని పోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, దీనిపైన వాస్తవాలు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.
మొత్తం మూడు సెగ్మెంట్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఒక సెగ్మెంటు, రెండోది ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, మూడోది బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు నిర్మాణం ఉంటుందన్నారు. దీనిపైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అంతర్గత రాజకీయాల మేలు కోసమే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ నాయకులు విమర్శలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల ఆరోపించారు. నిబంధనలు లేకుండా, వాటిని పాటించకుండా ఈ ప్రాజెక్టు మీద ఏపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం లేదని, నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దీనికి సంబందించి ఇప్పటికే సీడబ్ల్యూసీకి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతులు, ఆమోదం లేకుండా డీపీఆర్ను ఎలా ఇస్తామని అన్నారు. సీడబ్ల్యూసీ నుంచి తాము సమర్పించిన నివేదిక మీద గ్రీన్ సిగ్నల్ వచ్చాకనే డీపీఆర్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎలాంటి జల దోపిడీ చేయడం లేదన్నారు. వరద జలాలను ఉపయోగించుకోవడం ఏపీ హక్కు అని స్పష్టం చేశారు. ఎగువున ఉన్న రాష్ట్రాల ప్రయోజనాలు. నీటి అవసరాలు తీరాకనే మిగులు వరద జలాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏ రాష్ట్రానికి నష్టం లేదన్నారు. వర్షాకాలం రాక ముందే వేలాది టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని, ఒక ఏడాది అయితే ఏకంగా 7వేల టీఎంసీల గోదావరి నీళ్ల సముద్రంలోకి వృధాగా పోయిందన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పైన, ఆ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులపైన మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. వాళ్ల హయాంలో పూర్తి అయిన ప్రాజక్టులకు కూడా అనుమల్లేవని, అలాంటిది ఏపీలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న ప్రాజెక్టులపైన, వాటి అనుమతులపైన వాళ్లు మాట్లాతున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చేపట్టిన సీతారాంసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇటీవలే అనుమతులు ఇచ్చారని, అయితే ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబందించిన 75 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలన్న దురుద్దేశం తమ కూటమి ప్రభుత్వానికి కానీ, సీఎం చంద్రబాబుకు కానీ లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు బీయా ఎత్తిపోతల పథకం, ఎస్సార్ఎస్సీ వంటి తెలంగాణలోని అనేక ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు సహకరించినట్లు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు సహకారం అందించిన విధానాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు.
నిబంధనల ప్రకారం, దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కుల మేరకు కొన్ని ప్రాజెక్టుల విషయంలో సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలను వెల్లడించారే కానీ, ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలనే ఉద్దేం తమకు లేదన్నారు. నీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల మాటలు మినిట్స్ రూపంలో అపెక్స్లో ఉంటాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.