ఐదేళ్లలో 125 కేబినెట్‌ సమావేశాలు–25 కలెక్టర్‌ కాన్ఫరెన్సులు లక్ష్యం

ఈ నెల 15,16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు అంశాలపై మంత్రులు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.;

Update: 2025-09-13 16:34 GMT

తమ ఐదేళ్ల పాలనలో 125 కేబినెట్‌ సమావేశాలు, 25 కలెక్టర్ల కాన్ఫరెన్సులు నిర్వహించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 15,16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో చర్చించే అంశాలపై మంత్రులు, కార్యదర్శులతో శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్‌ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్డీపీ రూ.29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 2034కు తలసరి ఆదాయం రూ.10.55 లక్షలకు చేరేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీలో వ్యవసాయం అనుబంధ రంగాలే కీలకంగా ఉన్నాయని అన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో విభాగాధిపతులు పనిచేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ 25 కేబినెట్‌ సమావేశాలు నిర్వహించామని.. ఐదేళ్లలో 125 కేబినెట్‌ సమావేశాలతో పాటు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా అదే సంఖ్యలో రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే ఏడాదిలో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి చొప్పున ఐదేళ్లలో 25 జిల్లా కలెక్టర్‌ సమావేశాలూ నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3 శాతం వృద్ధి తగ్గిన కారణంగా రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపద కోల్పోయిందని అన్నారు.

కలెక్టర్ల కాన్ఫరెన్సులో 8 అంశాల వారీగా చర్చ
ఈసారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సును విభిన్నంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. సరైన వ్యక్తి, సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశామని అన్నారు. తాను 4వ సారి ముఖ్యమంత్రి అయినా ప్రజాప్రయోజనాల కోసం నిరంతరం ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూనే ఉంటానని సీఎం అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో మొదటి రోజున జీఎస్డీపీ అంశంపై ప్రజెంటేషన్‌ లో భాగంగా సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. జిల్లాలు ఈ రంగాల్లో ఎక్కడ ఉన్నాయన్న దానిపై కలెక్టర్ల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఇక రెండో అంశంగా సంక్షేమం, సూపర్‌ సిక్స్, అన్నా క్యాంటీన్లు, పీ4 తదితర అంశాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించిన ప్రజెంటేషన్‌ ఉంటుందని తెలిపారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్‌ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్‌ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి తెలుసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక రెండో రోజున ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్‌ డెవలప్మెంట్, ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సప్‌లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలను చర్చిస్తామని వివరించారు. ఏడో కేటగిరీలో రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ లాంటి అంశాలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రెండో రోజు 8వ అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ విభాగాలు అందించే పౌరసేవలపై ప్రజల్లో సంతప్త స్థాయిపైనా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ విజన్‌ ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం పేర్కోన్నారు.
నెక్స్‌ జెన్‌ సంస్కరణలపై కమిటీ
ఆర్టీజీఎస్‌ ద్వారా నేపాల్‌లో చిక్కుకు పోయిన తెలుగు వారిని వెనక్కు తీసుకువచ్చే ఆపరేషన్‌ విజయవంతమైందని సీఎం వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్‌ సహా అధికారులు కృషి చేశారని, దీనిపై ప్రజల్లో ప్రభుత్వం పట్ల మంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. వివిధ సంక్షోభ సమయాల్లో సరిగ్గా స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ పనితీరు మెరుగుపర్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం సూచించారు. అమరావతిలోని సీఆర్డీఏ భవనంలో మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ఇటీవల జీఎస్టీని రెండు స్లాబులకు కుదిస్తూ తెచ్చిన సంస్కరణ విజయవంతమైందని.. ఏపీలోనూ నాలా పన్ను రద్దు చేసి నెక్స్‌ జెన్‌ సంస్కరణను అమలు చేశామని సీఎం అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కమిటీ వేయాలని సీఎం సూచించారు. మరోవైపు చిన్న చిన్న కోర్టు వివాదాల కారణంగా ప్రభుత్వ సమయంతో పాటు ధనమూ వృధా అవుతోందని.. ఆర్బిట్రేషన్‌ ద్వారా కొన్ని అంశాలను పరిష్కరించుకునే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
Tags:    

Similar News