రెజ్లర్లకు సెక్యూరిటీ తొలగించారా? ఢిల్లీ పోలీసుల సమాధానమేంటి?

రెజ్లర్ల భద్రతను బుధవారం రాత్రి ఉపసంహరించుకున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలైంది. విచారించిన కోర్టు సెక్యూరిటీ పునరుద్ధరించాలని సూచించింది.

Update: 2024-08-23 08:06 GMT

భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI ) మాజీ అధ్యక్షుడు, బీజేసీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ.. గతేడాది రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతోపాటు పలువురు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు కాగా.. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం రెజ్లర్లు కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే కోర్టులో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వనున్న రెజ్లర్లకు కేటాయించిన భద్రతను ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకున్నారని వినేశ్ ఫొగట్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రెజ్లర్ల భద్రతను బుధవారం రాత్రి ఉపసంహరించుకున్నట్లు సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు భద్రతను పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతను ఉపసంహరించు కోవడానికి గల కారణాలను తెలపాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

ఇటు రెజ్లర్లకు భద్రత తొలగింపు వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సెక్యూరిటీ తొలగించలేదని చెప్పారు. భవిష్యత్తులో భద్రతా బాధ్యతలను హర్యానా పోలీసులకు కేటాయించాలని అభ్యర్థించాం. దీనిని ఢిల్లీ పోలీసు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే రిపోర్టు చేయడానికి ఆలస్యమైంది.’ అని తెలిపారు.

Tags:    

Similar News