భారత్ వర్సెస్ బంగ్లాదేశ్: అందరి కళ్లు ఈ ముగ్గురిపైనే..

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ కు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్లే. మరో వైపు ఇప్పటికే..

Update: 2024-06-22 11:22 GMT

ఐసీసీ టోర్నమెంట్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య గడచిన దశాబ్దంగా జరుగుతున్న మ్యాచ్ లన్నీ హోరాహోరీ గా సాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి రెండు జట్లు పోటీపడుతున్నాయి. సెమీస్ బెర్త్ కోసం భారత్ తప్పనిసరిగా ఈ మ్యాచ్ లో గెలవాలి. మరో మ్యాచ్ లో పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగాలి. కాబట్టి ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం.

ఇప్పటి వరకూ బంగ్లాతో జరిగిన నెక్ టూ నెక్ రికార్డులన్నీ పరిశీలిస్తే భారత్ కు అనుకూలంగా ఉంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ ను తేలికగా తీసుకునే అవకాశం లేదు. రోహిత్ తన జట్టు సభ్యులను ఈ విషయంలో ఇప్పటికే హెచ్చరించారు. గతంలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 2007 నాటి వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో భారత్ ను ఇంటిముఖం పట్టించింది బంగ్లాదేశే. గత దశాబ్ద కాలంగా ఆ జట్టు బాగా రాటుదేలింది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో, భారత్‌ టైటిల్‌ ఫేవరేట్ గా అనడంలో సందేహం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, ఒక్క రోజు వ్యవధిలోనే మరో గేమ్ కు సిద్ధం అయింది. గత మ్యాచ్ లో చేసిన ప్రదర్శన ఇప్పుడు కూడా కొనసాగాలని టీమ్ మేనేజ్ మెంట్ ఆశిస్తోంది.

విరాట్, రోహిత్, దూబే..
ఒపెనర్ గా విరాట్- రోహిత్ శర్మ ఇప్పటికి ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఫామ్ లో ఉన్న యశస్విజైశ్వాల్ ను కాదని విరాట్ ను ఒపెనర్ గా పంపడంపై చాలామంది క్రీడా పండితులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి తన స్థాయి తగ్గ ఆటను ఆడటంలో విఫలం అవుతూనే ఉన్నాడు.
మరో ఆటగాడు శివమ్ దూబే కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ లో సిక్స్ ల మోత మోగించిన దూబే.. ప్రపంచకప్ కు ఎంపిక అయిన తరువాత తన ఆ స్థాయి ప్రదర్శన ఇప్పటి వరకూ బయటకు రాలేదు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి సిక్స్ ల మోత మోగిస్తాడని, స్పిన్నర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడని ఆశలు పెట్టుకున్న సెలెక్టర్ల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇతని స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా తిరిగి ఫామ్ లోకి రావడం జట్టును ఆనందంలో ముంచెత్తింది. ముఖ్యంగా జట్టు కష్టంలో ఉన్నప్పుడు సూర్య కుమార్ యాదవ్ తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టులో కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలుపుకుంటాడని భావిస్తున్నారు. కరేబియన్ లో వికెట్లు స్పిన్నర్లకు తగినంత సాయాన్ని అందిస్తాయి కాబట్టి జడేజా, పటేల్ తో సహ ఫామ్ లో కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కడం గ్యారెంటీ
"ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఆడటం వల్ల ప్రయోజనం ఉందని నేను భావిస్తున్నాను. ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఉన్నారు, వారిలో ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు కాగా ఒక మణికట్టు స్పిన్నర్ ఉన్నారు" అని ఆఫ్ఘనిస్తాన్ తో గేమ్ తర్వాత అక్షర్ పటేల్ అన్నాడు.
"మా ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంది. మాకు మంచి టీమ్ ఉంది. మేము బాగా కమ్యూనికేట్ చేస్తాము. ఎవరు మొదట బౌలింగ్ చేయడానికి వచ్చినా, మేము ఏం చేయాలో కమ్యూనికేట్ చేసుకుంటాము. మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యం" అన్నారాయన.
కరేబియన్‌లో భారత్‌ ఏకైక లక్ష్యం ట్రోఫీని గెలవడమేనని, ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించడం మరో ముందడుగు. జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత్ గట్టి పోరు ఉంటుందని భావిస్తోంది. టోర్నీ అంతటా బ్యాటింగ్‌తో ఇబ్బంది పడిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఇప్పుడు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పవర్ హిట్టర్లు లేకపోవడం వారిని బాధపెడుతోంది. ఆ సమస్యకు త్వరిత పరిష్కారం లేదు. ఓపెనర్ లిట్టన్ దాస్, తాంజిద్ ఖాన్ వరుసగా విఫలం అవడం బంగ్లాదేశ్ కు ఉన్న కష్టాలను మరింత పెంచింది.
" బౌలర్లు తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మా తదుపరి మ్యాచ్‌లో భారత్‌పై మంచి ప్రదర్శన కోసం చూస్తున్నాను" అని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత వ్యాఖ్యానించారు.గత మ్యాచ్ లో శాంటో (41), తౌహిద్ హృదయ్ (40) ఇద్దరూ బాగా రాణించినప్పటికీ, మిగిలిన వారు అంతగా రాణించలేకపోయాయి.
బంగ్లాదేశ్, భారత ఏస్ బౌలర్ బుమ్రాను ఎదుర్కొవడం కత్తిమీద సామే. ఓవర్ కు 3.46 ఎకానమీతో పరుగులు మాత్రమే ఇస్తున్న ఈ యార్కర్ కింగ్.. పాక్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమే చేశాడు. మూడు వికెట్లు చేసి దాయాదీ నడ్డి విరిచాడు. కావునా బంగ్లాదేశ్ బూమ్రాను ఎదుర్కొవడానికి ప్రత్యేకంగా సన్నద్దంగా కావాల్సి ఉంటుంది.
స్క్వాడ్‌లు:
బంగ్లాదేశ్‌: తాంజిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో (కెప్టెన్‌), షకీబ్‌ అల్‌ హసన్‌, తౌహిద్‌ హృదయ్‌, మహ్మదుల్లా, మహేదీ హసన్‌, రిషాద్‌ హొస్సేన్‌, తస్కిన్‌ అహ్మద్‌, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌, ముస్తాఫిజుర్‌ రహమాన్‌, జాకర్‌ ఇస్లామ్‌, తఫుల్‌ ఇస్లాం, తఫుల్‌ ఇస్లామ్‌, తఫుల్‌ ఇస్లాం, సర్కార్.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


Tags:    

Similar News