‘‘అధికారంలోకి వస్తే 50 శాతం సీలింగ్ తొలగిస్తాం’’

తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారికి కోటా పెంచుతామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటర్లకు హామీ ఇచ్చారు.

Update: 2024-05-06 12:12 GMT

తమ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను తొలగిస్తామని, దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారికి కోటా పెంచుతామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటర్లకు హామీ ఇచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నాయని, అలా జరగకుండా ఉండేందుకు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.

“మీ పిల్లలు అత్యాచారానికి గురయ్యారు, మీ భూమి లాక్కున్నారు, కానీ మీడియా బయటపెట్టలేదు. కారణం మీడియా సంస్థల్లో ఆదివాసీలు లేరు'' అని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న 90 మంది బ్యూరోక్రాట్లలో ఒకరు మాత్రమే ఆదివాసీ, ముగ్గురు వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే చాలా తక్కువ మంది దళిత సమాజానికి చెందిన వారని తెలిపారు.

వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం: రాహుల్‌

ఖార్గోన్‌లో జరిగిన మరో ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, MGNREGA పథకం కింద రోజువారీ భత్యాన్ని ₹250 నుంచి ₹400కి పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. పేద మహిళలను లక్షాధిపతులుగా మార్చేందుకు ఇండియా బ్లాక్ ప్రభుత్వం వారి ఖాతాల్లో రూ. లక్ష జమ చేస్తుందని చెప్పారు. ఖార్గోన్ (ఎస్టీ), ఖాండ్వా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరపున పొర్లాల్ ఖర్తే, నరేంద్ర పటేల్‌ బరిలో నిలిచారు.

Tags:    

Similar News