తీవ్రవాదం, హింసకు మద్ధతుగానే చూస్తాం: కెనడాకు భారత్ కౌంటర్

భారత్- కెనడా మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారాయి. ఓ సమావేశంలో ఖలిస్తాన్ వేర్పాటువాదులకు ప్రధాని ట్రూడో మద్ధతు ప్రకటించడంతో భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Update: 2024-04-30 08:59 GMT

కెనడాలోని టోరంటో లో.. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతుండగా వినిపించిన ఖలీస్తాని నినాదాల పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వైఖరి ఇరు దేశాల మధ్య సంబంధాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని అభివర్ణించింది. వేర్పాటువాదం, తీవ్రవాదం, హింసకు కెనడా ప్రభుత్వం ఇచ్చిన మద్ధతుగా వీటిని చూడాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ ఘూటుగా హెచ్చరించింది. ఈ మేరకు భారత్ లో ఉన్న కెనడా డిప్యూటీ హై కమిషనర్ ను పిలిపించి సమన్లు జారీ చేసింది.

భారత- కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి చేరగా, ఇప్పుడు మరోమారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రసంగం చేస్తున్నప్పుడు వినిపించిన ఖలిస్తాన్ నినాదాలు, ట్రూడో ప్రసంగం వివాదాలను తారాస్థాయికి చేరేలా చేశాయి.
"కెనడా ప్రధానమంత్రి వ్యక్తిగతంగా ప్రసంగిస్తున్న కార్యక్రమంలో 'ఖలిస్తాన్'పై వేర్పాటువాద నినాదాలు లేవనెత్తినందుకు కెనడా డిప్యూటీ హైకమిషనర్‌ను ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు" అని విదేశాంగ శాఖ తెలిపింది. టొరంటోలో ఈవెంట్ జరిగిన ఒక రోజు తర్వాత డిప్యూటీ హై కమిషనర్ స్టీవర్ట్ వీలర్‌కు సమన్లు వచ్చాయి. సమావేశం సందర్భంగా కూడా ఆ దేశ ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.. సిక్కు సమాజం హక్కులు, స్వేచ్చ కాపాడేంందుకు కెనడా తిరుగులేని విధంగా సాయపడుతుందని ఆయన వివాదస్పద ప్రసంగం చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది.
క్షీణించిన సంబంధాలు
బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18న ఖలిస్తానీ ఉగ్రవాదీ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్- కెనడా సంబంధాల విషయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురైయ్యాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కెనడా ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఈ ఆరోపణలు న్యూఢిల్లీ ఖండించింది. అనంతరం కెనడాలో ఉన్న భారత రాయబారుల సంఖ్యకు అనుగుణంగా, మన దేశంలో ఉన్న కెనడా రాయబారుల సంఖ్య సమం చేయాలనే దౌత్య నిబంధనలను పాటించాలని భారత్ కోరింది. దీంతో కెనడా 41 మంది కెనడా దౌత్య అధికారులను భారత్ నుంచి స్వదేశానికి రప్పించుకుంది.
గత ఏడాది ట్రూడో ఆరోపణల నేపథ్యంలో కెనడా పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని వారాల తర్వాత వీసా సేవలు పునఃప్రారంభించబడ్డాయి. కెనడా, భారత వ్యతిరేక చర్యలు చేపట్టడం, ఖలిస్తాన్ మూకలకు మద్ధతు ఇవ్వడం ఇదే కొత్తకాదు. ఇంతకుముందు జస్టిన్ ట్రూడ్ తండ్రి పియరీ ట్రూడో కాలంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానంలో బాంబులు పెట్టి పేల్చివేశారు. ఇందులో 300 మంది ప్రయాణికులు మరణించారు. అయితే ఈ విచారణను పియరీ ట్రూడో అడ్డుకున్నారు.
క్యూబెక్ రాష్ట్రానికి మద్ధతుగా భారత్..
భారత్ లోని పంజాబ్ ను ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలనే వేర్పాటువాద ఉగ్రవాదులకు కెనడా ఎలా సాయం చేస్తుందో.. కెనడాలోని క్యూబెక్ రాష్ట్ర ఆందోళనలకు భారత్ అలాగే మద్దతు ఇవ్వాలని ఓ జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించినట్లు సదరు కథనం వివరించింది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన కెనడాలో యూరోప్ లోని చాలా దేశాల ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.  క్యూబెక్ అనే ప్రాంతంలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి భాష కూడా ఫ్రెంచినే. అయితే ఇక్కడ కూడా ఇంగ్లీష్ వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఫ్రెంచి వారికి నచ్చలేదు.
అందుకే తాము ఉన్న క్యూబెన్ రాష్ట్రాన్ని స్వతంత్ర్య దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేశారు. దీనిపై అప్పట్లో కెనడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ అంశాన్ని లెవనెత్తితే.. కెనడా కు మున్ముందు చిక్కులు తప్పవు.
Tags:    

Similar News