జూన్ 14 తర్వాత ఆధార్ కార్డులు పని చేయవంటూ వదంతులు

ఆధార్‌ కార్డులు జూన్ 14 తర్వాత పని చేయవా? వ్యక్తిగత వివరాల మార్పిడికి అవకాశం లేకుండా లాక్ చేస్తున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది

By :  Admin
Update: 2024-05-26 16:46 GMT

ఆధార్‌ కార్డులు జూన్ 14 తర్వాత పని చేయవా? వ్యక్తిగత వివరాల మార్పిడికి అవకాశం లేకుండా లాక్ చేస్తున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది. ఈ వదంతులతో జనం ఆధార్ సెంటర్ల ముందు పెద్దఎత్తున గుమికూడుతున్నారు. దేశంలో ప్రతి పనికీ, అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ ను అనుసంధానం చేయడంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జూన్‌ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే కార్డు పని చేయదంటూ వస్తున్న వార్తలు జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దీనిపై ఆధార్ సంస్థ (ఉడాయ్) స్పందించింది.

ఇంతకీ అసలు విషయమేమిటంటే...
ఆధార్‌ కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా సులువైన పని. కొన్నింటిని ఆన్ లైన్ లో కూడా మార్చుకోవచ్చు. పుట్టిన తేదీని రెండు సార్లు మార్చుకోవడానికి అవకాశం ఉండగా మిగతా వివరాలను తరచూ మార్చుకోవచ్చు. ఆధార్ కేంద్రాల్లోనూ, మీ సేవా కేంద్రాల్లో కూడా మార్చుకోవచ్చు. వీటిలో కొన్ని సేవలు ఉచితం కాగా మరికొన్నింటికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. జూన్ 14 నుంచి రానున్న నిబంధన ప్రకారం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్‌ 14 గడువని తెలిపింది. వివరాలు మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుంది. ఆ తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.ఆధార్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుం చెల్లిస్తే సరిపోతుంది. వివరాల మార్పునకు విధించిన జూన్‌ 14 గడువు సమీపిస్తుండటంతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి.
జూన్ 14న ముగిసే గడువు దేనికంటే...
ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది. ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని ఈ ఏడాది జూన్‌ 14 వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు ముగియనుంది. దీన్ని సోషల్ మీడియాలో చిలవలు పలవలు చేయడంతో జనంలో గందరగోళం నెలకొంది. ఉడాయ్ వివరణతో ఆ గందరగోళానికి తెరపడింది.
కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని వివరించింది.
వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి తాజా గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సమర్పించాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఉడాయ్ వెబ్ సైట్ ను చూడవచ్చు.
Tags:    

Similar News