రష్యా చైనాల్లో సోషలిజం పోయిందీ, ప్రజాస్వామ్యమూ పోయింది. ఎందుకు?

రష్యా, చైనాల్లో మార్క్సిజం వల్ల ప్రజాస్వామ్యమూ పోయింది, సోషలిజమూ పోయింది. కార్మిక వర్గం కాకుండా కమ్యూనిస్టు నేతల నియంతృత్వం వచ్చింది. ఎందుకలా జరిగింది?

Update: 2024-04-30 06:19 GMT

బి.ఎస్ రాములు, సామాజిక తత్వవేత్త, హైదరాబాద్



'మే' డే నాడు మెదడుకు మేత


- బి ఎస్ రాములు, సామాజిక తత్వవేత్త


కొందరికి వయసు పెరిగినా అవగాహన పెరగదు. ఎవరో మహానుభావులు ఏవో చెప్తారు.వాటిని మోసుకెళ్లడమే పనిగొ పెట్టుకుంటారు. “ఎంత మహానుభావుడు చెప్పినా నీకు స్వయాన జీవితంలో సత్యం అనుభవంలోకి వచ్చాకే నమ్ము,” అన్నాడు బుద్దుడు. కొందరేమో తాము చెప్పిందంతా నమ్మాలని ఆచరించాలని కోరుతుంటారు.

మార్క్సు ఎంగెల్స్ కూడా కొన్నింటిని అలా చెప్పారు. కొన్ని ఊహించారు. ఫలానా విధంగా జరగవచ్చు అనే ఊహని, ప్రిడిక్షన్సు ను పునః పరిశీలన చేయకుండా అదే పనిగా చెప్పడం చేస్తే మత విశ్వాసంలాగా మారడం.

రష్యా, చైనాల్లో మార్క్సిజం వల్ల ప్రజాస్వామ్యమూ పోయింది, సోషలిజమూ పోయింది. నియంతృత్వం వచ్చింది. ఎందుకలా జరిగింది? కార్మిక వర్గ నియంతృత్వం అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెలాయించే నియంతృత్వమే అని రష్యా చైనా విప్లవాలు వాటి పరిణామాలు తెలుపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం సమాన అవకాశాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు రాజ్యంగ బద్దంగా లభించే హక్కులు. వాటిని ఉపయోగించుకుంటూ పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కులు అంటూ మానవ హక్కులంటూ ప్రశ్నించి సాధించి మార్క్సిజం చేబూని విప్లవాలు చేసారు.

విప్లవాలు తెచ్చాక ఈ ప్రజాస్వామిక హక్కులు సైతం లేకుండా పోయాయి. నాయకుల నియంతృత్వం రాజ్యమేలుతున్నది. ఇలా ఎందుకు జరిగింది?

సోవియట్ యూనియన్,  చైనా విప్లవాలలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడం ఎలా? సోషలిజం వచ్చాక జరిగిన పరిణామాలకు మార్క్సిజంలో పరిష్కారం ఎలా దొరుకుతుందా? దానిదంతా సిద్దాంత నియంతృత్వం కదా! 


బి.ఎస్ రాములు, సామాజిక తత్వవేత్త, హైదరాబాద్

ప్రపంచంలో మార్పు ఇలాగే జరగాలి జరుగుతుంది, అందుకు ఇలా చేయాలి. ఇదొక్కటే మార్గం అని చెప్పడం ద్వారా పాలక వర్గాలు శ్రామిక వర్గాలు రెండు కూడా ఎలా ఆడాలో మార్క్సిజం గీత గీసి చెప్పింది.

దీన్నే నియతి వాదం, డెటర్మినిజం, కర్మవాదం అంటారు. ఆధునిక మీడియా భాషలో మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటారు. మార్క్సిజం చేసే చెప్పే ఈ రెండు వర్గాల మధ్య పోరాటం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ గా మారి పోయింది.చివరకు సోషలిజం అనంతరం ప్రజాస్వామ్యం కూడా మిగిలించన నాయకుల నియంతృత్వాన్ని స్థిర పరుస్తూ వచ్చింది. ఇది ఎలా జరిగింది? ఈ స్థితిని మార్చుకోవడం ఎలా అని తెలుసుకోవవడం ప్రజల కర్తవ్యం.

మార్క్సిజం లెనినిజం మావోయిజం మ్యాచ్ ఫిక్సింగ్ గా మారి పోయి చాలా కాలమైపోయింది. సోవియట్ యూనియన్ లోంచి, పీపుల్సు చైనాలోనుంచి శాంతియుతంగా ప్రయివేటు యాజమాన్యం వికాసం చెందుతూ వచ్చింది. దీన్నించి బయటపడి అక్కడ తిరిగి సోషలిజం నెలకొల్పడం ఎలా అనే చర్చ ద్వారా నూతన పరిస్థితుల్లో నూతన అవగాహన, ఆచరణ ఉత్పన్నం కావాలి.

ఎక్కడ ప్రయోగాలు జరిగాయో, ఎక్కడ ఆ ప్రయోగాలు విఫలమై మలుపు తిరిగాయో అక్కడే నూతన ఆలోచన జరగాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి. రష్యా చైనాల్లో పోగొట్టుకున్నాం. కనీసం ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోయిన స్థితిలో అక్కడ రాజకీయాలు సాహిత్యం సంస్కృతి, వైజ్ఞానిక పరిశోధన, ఉత్పత్తి పంపిణీ , పాలసీలు కొనసాగుతున్నాయి.

ఒక తాగుబోతు రూపాయి పోయిందని కరెంటు వెలుగు కింద చాలా సేపు వెతుకుతున్నాడట. ఒకాయన చూసి చూసి ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే చీకటి వైపు చూపాడట! చీకట్లో పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? అని అడిగితే! భలే వున్నావు చీకట్లో ఎట్ల కనపడుతుంది ? వెలుగున్న చోట వెతకాలి అన్నాడట! అట్లావుంది వామపక్ష మేధావుల పరిస్థితి.

రష్యా, చైనాల్లో పోగొట్టుకున్నది ఆ దేశాల్లోనే వెతకాలి గాని మార్క్సిజం వెలుగులో వెతకాలి అనడం ఆ తాగుబోతు తర్కానికి వీరి తర్కానికి తేడా లేదు.

మార్క్సిజం ఇట్ సెల్ఫ్ ఏ మ్యాచ్ ఫిక్సింగ్ అని పదేళ్లుగా నేను చెబుతున్నాను. దాన్నే ఆ తర్వాత ఆంధ్రయూనివర్సిటీ సెమినార్ ప్రధాన ప్రసంగంలోను వివరించాను. పుస్తకంలోనూ వేసాను. ఆసక్తి గల వారు వివరంగా తెలుసుకోవచ్చు. ప్రపంచీకరణ, ప్రపంచ పెట్టుబడి దారుల గ్లోబలైజేషన్, ప్రపంచ కార్మికులు ఏకం కావాలనుకుంటే కాలేదు గాని పెట్టుబడిదారులు ఏకమయ్యారు. పోటీ పడుతున్నారు.

అందువల్ల లెనినిజం మావోయిజం దశ అంతరించి మార్క్సిజం దశ వచ్చింది. రష్యా చైనా పెట్టుబడిదారీ దేశాలుగా మారినాయంటేనే మార్క్సిజం లెనినిజం కాలం చెల్లిపోయి గ్లోబలైజేషన్ రావడం సూచిస్తున్నది. శ్రమశక్తి ఇపుడు ఆప్టికల్ ఫైబర్ వ్వవస్థ ద్వారా స్థల కాలాలు దేశాల సరిహద్దులు చెరిపి వేసి ముందుకు సాగుతున్నది. సోషలిజం అంటే ఐ ఏ ఎస్ ల స్థానంలో పార్టీ నాయకులు పరిశ్రమలకు సంస్థలకు ప్రభుత్వాలకు పరిపాలకులు కావడం! అందుకే వారు శాంతియుతంగా అహింసాయుతంగా వాటిని ప్రయివేటీకరణ దారి మళ్లించగలిగారు. అలా లోపలి నుంచే స్వార్థం ప్రవేశించి కనీస ప్రజాస్వామ్యం లేని పారిశ్రామిక రాజకీయ వ్యవస్థలు స్థిర పడ్డాయి. రాచరికంలా జీవిత పర్యంతం నేతలయ్యారు. ఆదేశాలలో ఇపుడు జరగాల్సింది ప్రజాస్వామ్య వ్వవస్థల పునరుద్దరణ. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలున్న చోట అన్ని రంగాల్లో మరింత ప్రజల సామాజిక వర్గాల , ప్రాతినిధ్యం, మరింత మరింత ప్రజా స్వామ్యమా తప్ప నియంతృత్వాన్ని స్థిర పరిచే మార్క్సిజం చెప్పిన విప్లవాలు కాదు.

అందుకోసం లక్షలాది ప్రజలు చనిపోవడం కాదు. కోట్లాది ప్రజలు నిర్బంధాలతో త్యాగాలు కాదు. ఆ తర్వాత సోషలిజం పేరిట నియంతృత్వంలో నియంతల పాలనలో అణగారి పోవడం కాదు.

జరగాల్సింది భారత రాజ్యాంగంలోని ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు, 12 వ ఆర్టికల్ నుండి 19 వ ఆర్టికల్ దాకా గల ప్రజాస్వామిక విలువలు, హక్కులు ఖచ్చితంగా అమలు జరుపుకోవడానికి పూనుకోవడం. అందుకు ప్రతిన బూనడం.

ఇదే నేటి మేడే సందేశం కావాలి.




Tags:    

Similar News