రాయలసీమ దాహం తీర్చేందుకు నూతన మార్గం
నది గర్భంలో ప్రాజెక్టుల నిర్మాణం;
ఇరిగేషన్ ప్రాజెక్టులు నది మీద కడతారనే సంగతి అందరికీ తెలిసిందే!! కానీ, భారీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వందల కోట్ల రూపాయల ఖర్చు లేకుండా, ప్రజలే ఇంజనీర్లుగా మారి, నది కింద భూమి అంతర్భాగంలో నిర్మించిన అరుదైన సాంకేతిక అద్భుతం ఇది. కరువు నుండి బయట పడటానికి, రైతులంతా చేతులు కలిపి సాధించిన జలచైతన్యం ఇది.
వారికి భారీ ప్రాజెక్టులు నిర్మించుకునే ఆర్ధిక పరిస్ధితి లేదు. ఎప్పుడో కొంత వాన పడినా ఆ నీటిని చెరువుల్లో నిలవ ఉంచినా నాలుగు రోజుల్లోనే ఆవిరై పోతాయి. వానా కాలంలో కొంతకాలం ప్రవహించే చిన్న ఏరులే అక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరు. ఆ నీటినే ఏడాదంతా ఉపయోగపడేలా దాచుకోవాలి.
ఈ ప్రాజెక్ట్లు ఎక్కడా ? ఎలా?
రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని ఓడి చెరువు మండలం( Obula Devara Cheruvu ) లో మూడు గ్రామాల మీదుగా సోమావతి నది వానలు పడినపుడు ఉవ్వెత్తున ప్రవహిస్తుంది. కానీ వేసంగిలో ఎండిపోతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో రైతులు వ్యవసాయం చేయలేక కొన్ని వందల ఎకరాలు బీడుగా వదిలేశారు. వర్షం కురిసినా ఆ నీటి ప్రయోజనం తాత్కాలికమే. నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో వాన నీళ్లు కాసేపటికే కనుమరుగయ్యేవి. ఈ పరిస్థితిని గమనించారు.మైరాడ సంస్ధ ( MYRADA ) ప్రతినిధులు. ఒక కొత్త విధానంలో జలసంరక్షణ చేపట్టి నీటిసమస్యలకు చెక్ పెట్టాలని గ్రామస్తులకు అవగాహన కలిగించారు.
సోమావతి నది కింద డ్యామ్లు నిర్మించినప్పటి దృశ్యాలు.
‘‘ మామూలుగా అయితే, నదీ ప్రవాహాన్ని ఆపి నీటిని పొలాలకు మల్లించడానికి నదిపైన ప్రాజెక్టులు కడతారు. రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకొని కాలువలకు వదులుతారు. ఇదంతా భారీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వందల కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్న పని. భారీ అంచనాలతో ప్రభుత్వాలు చేయాల్సిన పని. దీనికి భిన్నంగా నది అడుగున భూమిలో ప్రవహించే జలాలను ఆపితే, ఎలా ఉంటుంది?అది కూడా కొన్ని లక్షల ఖర్చుతో అని మా సంస్ధ కొందరు యువ ఇంజనీర్లుతో ఆలోచించి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది.
దీనివల్ల భూగర్బజలాలు పెరిగి, అన్ని సీజన్లలో పంటలకు లోటు లేకుండా ఉంది. సాగు విస్తీర్ణం దాదాపు 400 ఎకరాలకు విస్తరించింది.’’ అని, ఈ ప్రాజెక్టును సమన్వయం చేసిన మైరాడ సంస్ధ ప్రతినిధి నాగేందర్ అన్నారు. ఇటీవల కదిరిలో మైరాడ ఆఫీసులో ఆయన్ని కలిసినపుడు ఈ ప్రాజెక్ట్ విశేషాలు చెప్పారు.
ఇరిగేషన్లో ఇదొక కొత్త ప్రయోగం.
కర్నాటక లోని కొలారు సమీపంలోని నందిదుర్గ కొండలలో పుట్టిన పెన్నా నది అనంతపురం జిల్లా మీదుగా ప్రవహించి, నెల్లూరుకి ఈశాన్యంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. దానికి ఉప నది సోమావతి. ఇది అనంతపురం జిల్లాలో ఎగువన సున్నంపల్లి, మహమ్మదాబాద్, గాలికుంట్ల పల్లి మీదుగా దిగువకు ప్రవహిస్తుంది. ఒక్కో గ్రామానికి, ఆరుకిలో మీటర్ల దూరంలో మూడు గ్రామాల వద్ద నదికింద సబ్ సర్ఫేస్ డ్యామ్ లు నిర్మించారు.
నది మీద ఇసుక మేటలు ఎక్కువ ఉన్న చోట 9 మీటర్ల లోతులో భూమి అంతర్భాగంలో జలప్రవాహాన్ని నిలప డానికి, నదికి అడ్డంగా రెండు గట్లను కలుపుతూ 120 మీటర్లు పొడవున 3 గ్రామాల దగ్గర చెక్ వాల్ నిర్మించారు. ప్రవాహానికి కొట్టుకు పోకుండా వంపులు తిప్పుతూ ఈ నిర్మాణం ఉంటుంది. భూమి అంతర్భాగంలో ఈ నిర్మాణం ఉంటుంది కాబట్టి పైకి కనిపించదు. కానీ ,భూగర్భనీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.అక్కడి పంటలకు నీటివనరుగా మారుతుంది.
ఇలా నిర్మించిన ఆనకట్టలను సబ్ సర్ఫేస్ డ్యామ్ ( Subsurface dams ) అంటారు. జలవనరులు లేని,కరవు ప్రాంతాలలో చిన్న నదులు,వాగుల కింద, నీటి ప్రవాహం తగ్గిన తరువాత నిర్మిస్తారు. దీనివల్ల, ఇసుక పొరల కింద ఉన్న నీటి నిల్వ కేంద్రాల్లో, నీరు ఆవిరై పోకుండా చాలాకాలం నిలువ ఉంటుంది. ఇసుక వల్ల సహజంగానే వడపోత జరిగి నీరు స్వచ్ఛంగా మారుతుంది.
‘‘ ఈ డ్యామ్లు కట్టాక, బోర్లు, బావుల్లోంచి, పరిశుభ్రమైన నీరు వస్తోంది.ఏడాదంతా బోర్లు ఎండి పోవడం లేదు. కూరగాయలు,వేరు శెనగ పండిస్తున్నాం. కొందరు మామిడి తోటలు పెంచారు.రెండు పంటలు పండిస్తున్నాం. ఇపుడు మాకీ ఇసుక కింద ఆనకట్టలే జలవనరులు.’’ అంటారు తమ పొలంలో డ్రిప్ తో టమాటా సాగు చేస్తున్న గాజుకుంట్లపల్లికి చెందిన గంగినాయుడు, కిష్టప్ప.
తక్కువ ఖర్చుతో కరవు నేలలో సాగు నీటి సమస్యకు చెక్ పెట్టిన ఈ వినూత్న ప్రయత్నం వెనుక ఉన్న మైరాడ స్వచ్ఛంద సంస్ధకు అరురైన చరిత్ర ఉంది.
దేశంలో తొలి సారి ఎస్.హెచ్.జీ వ్యవస్ధకు రూపకల్పన
మైసూర్ రీ సెటిల్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎజన్సీ( Mysore Resettlement and Development Agency ) 1968లో కర్నాటకలో ఏర్పాటయిన స్వచ్ఛంద సంస్ధ. టిబెట్ నిరాశ్రయులకు ఇండియాలో పునరావాసం కల్పించడానికి భారత ప్రభుత్వం ఆరోజుల్లో మైరాడ సేవలు పొందింది.
కరువు ప్రాంతాల్లో సహజవనరుల సంరక్షించి , భూగర్భజలసంరక్షణ కోసం భారతదేశంలో వాటర్ షెడ్ కార్యక్రమాన్ని తొలిసారిగా అమలు చేసింది మైరాడ. పేదమహిళల స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాల ఏర్పాటే మార్గం అని ఎస్.హెచ్.జీ వ్యవస్ధను ప్రవేశ పెట్టిన ఘనత కూడా మైరాడ సంస్ధదే.
సబ్సర్ఫేస్ డ్యామ్ వల్ల పెరిగిన భూగర్భ జలాలు
‘‘కరువు సీమలో 2007 లో సోమావతి నది కింద ఈ సబ్సర్ఫేస్ డ్యామ్ నిర్మించాం. ప్రజల భాగస్వామ్యంతో 3 నెలల్లో ( మార్చి నుండి జూన్ ) పూర్తిచేశాం.అప్పుడు ఒక డ్యామ్కి రూ.16.75 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. ఈ ప్రాజెక్టువల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవనోపాధులు బలోపేతం అయ్యాయి. భూగర్భజలాలు గతంలో కంటే 30శాతం పెరిగాయి.వైవిధ్యమైన పంటలతో నాలుగు గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయి. ’’ అంటారు కదిరిలోని, మైరాడ స్వచ్ఛంద సంస్ధ, ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి .
మెట్ట ప్రాంతపు రైతులకు వరం!
నది కింద ప్రాజెక్టులు కడుతూ నయా పంథాలో నీటి నిల్వకు శ్రీకారం చుట్టిన వీరి ప్రయత్నం మెట్ట ప్రాంతపు రైతులంతా ఆచరించదగింది. కాలంతో, వాతావరణంతో సంబంధం లేకుండా ఎక్కువ ఉత్పాదకత సాధించడం... తక్కువ ఖర్చుతో మంచి రాబడిని రైతు పొందేలా చూడడం... అనే లక్ష్యాలతో పనిచేస్తున్న మైరాడ సంస్థ సభ్యులు భూగర్భంలో నీటి వనరులను పెంచడం వల్ల మంచి ఫలితాలే సాధించారు.
అనంతపురం జిల్లాలోని ఓడి చెరువు మండలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు
1, సోమావతి నది అడుగున కట్టిన మూడు డ్యామ్ల వల్ల . సుమారు 210 ఎకరాల బీడు భూమి సాగు లోకి వచ్చింది. 60కి పైగా బోర్ వెల్స్ ,ఇరవై ఊటకుంటలు, పది బావుల్లో జలమట్టం పెరిగింది. 150 కి పైగా రైతులు లబ్ది పొందారు.
2, గ్రౌండ్ వాటర్ పెరగడంతో పశువులకు నీరు దొరుకుతుంది. పశుగ్రాసం పెరగడం వల్ల రైతులు పశు పోషణ చేపట్టారు. 628 పశువులు,1300 గొర్రెలు పెంచుతున్నారు.
3,నీరు ఉందని విచ్చల విడిగా వాడకుండా, చుక్కల సేద్యం చేస్తూ నీటిని పొదుపు చేస్తున్నారు. రసాయన ఎరువులు తగ్గించి భూసారం కాపాడుతున్నారు. తక్కువ నీటితో పండే కూరగాయలు,సన్ ఫ్లవర్,మామిడి తోటలు పెంచుతున్నారు. వ్యవసాయ పనులు పెరగడం వల్ల వలసలు తగ్గాయి.
ఒకపుడు ఒక పంట కూడా పండని ఓడి చెరువు ప్రాంతంలో సబ్సర్ఫేస్ డ్యామ్ వల్ల వరితో పాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు
నీరు పుష్కలంగా నిల్వ చేయడానికి భారీ జలాశయాలో, పెద్ద ఎత్తున ఖర్చో అవసరం లేదు. రైతుల మధ్య అవగాహన ఉంటే తమ ప్రాంతంలో ప్రవహించే నదులు,వాగులు కింద , అతి తక్కువ ఖర్చుతోనే ఇలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఉపాధి హామీపథకాన్ని ఇలాంటి పనులకు ఉపయోగిస్తే కరవు ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి. ‘‘ఇవి మాటలో, నీటి మూటలో కాదు. నిజమైన ప్రగతి. మీకు సంకల్పముంటే మీ నది అంతర్భాగమే ఓ పెద్ద రిజర్వాయర్ అవుతుంది. మండుటెండల్లో నది ఎండి పోయినా మీ పొలాలకు పుష్కలంగా నీరు అందుతుంది.’’ అని నిరూపించారు ఈ రాయలసీమ ప్రజలు .